జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కొత్త ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం మూడు రోజుల పాటు రాయలసీమ పర్యటనకు వచ్చిన ఆయన తాజాగా కీలకమైన కడప జిల్లాలో పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎప్పుడూ చేసే విమర్శలనే ఆయన మళ్లీ చేశారు. జగన్ను తిట్టిపోశారు. ఇక, ఈ క్రమంలోనే కడప కష్టాలపై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి ప్రజలు వలస బాట పడు తున్నారని, ఇక్కడి ప్రజలను అబివృద్ది చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. అదేసయమంలో రాష్ట్ర ప్రబుత్వం ఎలాగూ ఇక్కడి సమస్యలను పట్టించుకోవడం కాబట్టి తానే పూనుకుని కేంద్రంని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. ఇదే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
కేంద్రానికి లేఖలు రాయడం అనేది మంచిదే అయినా.. గతంలో ప్రత్యేక హోదా విషయంలో పవన్ ఏంచేశారనే ప్రశ్న సహజంగానే తెరమీదికి వస్తోంది. గతంలో హోదా కోసం అనేక వ్యాఖ్యలు చేసిన పవన్.. ఇప్పుడు దానిని పక్కన పెట్టారు. పైగా ప్రజల్లో దీనిపై డిమాండ్ లేదని అపవాదును ఏకంగా ప్రజలపైకి నెట్టేశారు. ఈ విషయాన్ని ఆయన దాదాపు మరిచిపోయారు. ఇక, ఇప్పుడు కడప అభివృద్దిపై కేంద్రానికి లేఖ రాస్తానని చెబుతున్నారు. అయితే, ఇక్కడ మరో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
అసలు చంద్రబాబు హయాంలో కడప, అనంతపురం వంటి వెనుక బడిన, కరువు పీడిత జిల్లాల అభివృద్ధికి 350 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చింది. అయితే, వాటిని సకాలంలో వినియోగించని కారణంగా కేంద్రం వెనక్కి తీసేసుకుంది. మరి ఆ సమయంలో పవన్ ఏమయ్యారు? ఇప్పుడు ఈయన తగుదునమ్మా అని లేఖ రాస్తే.. దానిని చదివేందుకు ప్రధాని మోడీ ఖాళీగా ఏమైనా ఉన్నారా? అనేది కూడా ప్రశ్న.
ఇక, పవన్ లేఖలు రాయాల్సి వస్తే.. యురేనియం అన్వేషణ అనే ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. కానీ, ఆయన జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇక, రాజధానికి శంకు స్థాపన చేసిన మోడీ.. తర్వాత దానికి కేటాయించాల్సిన నిధులను కూడా ఇవ్వలేదు. ఇక, వెనుక బడిన జిల్లాలకు నిధులు ఇలా అనేక సమ స్యలు ఉన్నాయి. మరి వాటన్నింటి మీదా కూడా లేఖలపై లేఖలు రాసుకుంటే మంచి పేరు వస్తుందేమో పవన్ ఆలోచించు కుంటే మంచిదని సూచిస్తున్నారు పరిశీలకులు.
రాష్ట్రంలో జగన్ పాలన ప్రారంభించి ఆరు మాసాల్లోనే బ్రహ్మాండం జరిగిపోవాలని ఎవరూ అనుకోవడం లేదు.. ఒక్క చంద్రబాబు, పవన్లకు తప్ప.. అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి వీటికి ఆయన ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఏదేమైనా పవన్ లేఖల నాయకుడిగా మారితే కాదనేవారు ఎవరుంటారు? ఆయన మాటలకు ఎలాగూ విశ్వసనీయత పోయింది. ఇప్పుడు రాతలకైనా విశ్వస నీయత ఉంటే మంచిందని సూచిస్తున్నారు.