ప్రతిపక్షం అన్నాక కొంత నిశిత పరిశీలన, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? అనే విషయాలను పరిగణనలోకి తీసుకుని.. ప్రభు త్వాన్ని విమర్శించడం అదేసమయంలో సూచనలు చేయడం, సలహాలు ఇవ్వడం అనేది కామన్ తతంగం. అయితే, తాజాగా ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జగన్ ప్రభుత్వంపై భారీ ఎత్తున చార్జ్ షీట్ను విడుదల చేసింది. నిజానికి ఏ ప్రబుత్వానికైనా ఆరు మాసాల సమయం చాలా తక్కవే అనేది అందరూ అంగీకరించే విషయం. రాజధాని విషయంలో ఎందుకు నిర్మాణాలు చేయలేక పోయారు.. అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు.. అప్పట్లో చంద్రబాబు అండ్ టీం ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసింది.
అనుకూల మీడి యాలో అనేక విషయాలను ఏకరువు పెట్టింది. చిన్న ఇల్లు కట్టుకునేందుకే బోలెడు సమయం పడుతుందని, అలాంటి సమయం లో రాజధాని నిర్మాణానికి సమయం పట్టదా? అని కూడా ప్రకటించారు. మరి కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి తన ప్రాధాన్యాలు తెలుసుకునేందుకు, ప్రజానుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు సమయం పట్టదా? ఆరు మాసాల్లోనే అద్భుతాలు జరిగి పో తాయని ప్రపంచ మేధావిగా పేరున్నటీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తే.. అంతకన్నా ఫూలిష్ నెస్ మరొకటి ఉండనే ఉండదు.
అయినా కూడా ఆరు మాసాల్లో జగన్ పాలనా విధానంపై ఓ ప్రధాన ప్రతిపక్షంగా చార్జ్ షీట్ను విడుదల చేసింది. అయితే, ఈ సమ యంలో కేవలం జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఏకైక కారణం తప్ప.. మరొకటి ఎక్కడా కనిపించక పోవడం గమనార్హం. నిజానికి జగన్ పాలన ప్రారంభించడానికి ముందుగానే ఓ కీలక నిర్ణయం ప్రకటించారు. తన మేనిఫెస్టోలో ఏమైతే చెప్పాడో.. అదే అమలు చేస్తానని, ప్రజల అభివృద్ధి తన ప్రభుత్వ విధానమని ప్రకటించారు.
దీని ప్రకారమే ఆయన పింఛన్లను దఫ దఫాలుగా పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే 250 చొప్పున పెంచారు. ఇక, మద్య నిషేధం అంశంపైనా జగన్ ప్రత్యేకంగా ప్రకటించిన మేరకు వైన్ షాపుల సంఖ్యను 20శాతం తగ్గించారు. అదేసమయంలో బార్లకు కొత్త పాలసీ తీసుకువచ్చారు. సమయాన్ని కుదిం చారు. ధరలు పెంచారు. ఇక, రైతు భరోసా కింద కేంద్రం అంతిస్తుంది.. నేను ఇంతిస్తానని జగన్ ఎక్కడా ప్రకటించలేదు.
తాను ఇస్తానన్న 12500 ఇస్తానని చెప్పారు తప్ప.. ఎక్కడా వీటికి విభజన రేఖలు గీయలేదు. కానీ, వీటిని బూతద్దంలో చూసిన టీడీపీ వీటినే ప్రజలకు వివరించాలని ప్రయత్నించడం పార్టీకి పరువు పోతున్నంత పని అవుతోంది. అదే సమయంలో తమ ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని భావించడం చంద్ర బాబు సీనియార్టీకే మచ్చగా వైసీపీ నా యకులు దుయ్యబడుతున్నారు.
గత ప్రభుత్వ పథకాలను ప్రజలు మెచ్చుకొని ఉంటే బాబుకే మళ్లీ పట్టం కట్టేవారు కదా? అనే ప్రశ్నకు టీడీపీ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇక, సీనియర్ మోస్ట్ నాయకుడిగా చంద్రబాబు ఈ చార్జ్ షీట్ ద్వారా ప్రభు త్వ తప్పులను పోగేసి మరీ ఎత్తి చూపించడంలో సక్సెస్ అయ్యారని అనుకున్నా.. సలహాలు , సూచనలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. సీనియర్ నాయకుడిగా, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవాన్ని పోగేసుకున్న చంద్రబాబు కనీసం ఒక్కటంటే ఒక్క సూచన చేయలేక పోవడం గమనార్హం.
సరే.. ప్రత్యేక హోదా విషయంలో జగన్ ప్రభుత్వం, ఆయన ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారని అనుకున్నా.. మరి గడిచిన ఈ ఆరు మాసాల్లో చంద్రబాబు దీని కోసం తన ఎంపీలతో అయినా .. పోరాటం చేయించి ఉంటే బాగుండేది కదా?! పోనీ తనే స్వయంగా రంగంలోకి దిగి ఉంటే ప్రజల్లో సానుభూతి పెరిగేది కదా?! కానీ ఈ ప్రయత్నాలు చేయడం మానేసి .. ఫక్తు రాజకీయాలకే పరిమితం అవడం రాష్ట్రానికి చంద్రబాబు వంటి మేధావి ఉన్నా.. ప్రయోజనం శూన్యమనే వాదనకు బలం చేకూర్చడమే అవుతుంది.