చంద్రబాబునాయుడు రాజకీయ గండరగండడు. ఆయనకు కూడా భయాలు ఉంటాయా. ప్రత్యర్ధిని ముందే చిత్తు చేసే వ్యూహాలు రచించడంతో బాబుకు సరిసాటి ఎవరూ లేరు కూడా. ఆయన ఒక మాట అనాలంటే వందసార్లు ఆలోచిస్తారు. అంటే అంత జాగ్రత్తగా బాబు రాజకీయం ఉంటుందని అర్ధం. మరి చంద్రబాబు అంటేనే ఆయన చెప్పుకున్నట్లుగా ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ.
ఇలాంటి బాబు మహారాష్ట్ర పరిణామాల మీద కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పట్ల జాతీయా మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తన మిత్రుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీని చీల్చి రాత్రికి రాత్రి బీజేపీ అధికారంలోకి వస్తే బాబు కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం వెనక కారణాలను ఒక ఆంగ్ల పత్రిక తనదైన విశ్లేషణను రాసింది.
అందులో బాబుకు ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భయం పట్టుకుందని ఆ పత్రిక పేర్కొంది. బాబు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట అన్నా కూడా ఆయనకు మోడీ నుంచి ఇబ్బందులు వస్తాయని భావించే నోరు విప్పడంలేదని కూడా రాసుకొచ్చింది. అదే విధంగా చంద్రబాబు ఏపీలో ఘోరంగా ఓడిపోయారని, దాంతో ఆయన మళ్ళీ బీజేపీతో పొత్తుకు ఆరాటపడుతున్నారని కూడా పేర్కొంది.
ఇలా అనేక రకాలక కారణాలు, భయాలతోనే బాబు బీజేపీ లాంటి పార్టీ అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా కిక్కురుమనడంలేదని రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆరు నెలల క్రితం జాతీయ కూటమి అంటూ బాబు ఢిల్లీ, ముంబై, పశ్చిమ బెంగాల్ వంటి చోట్లా ఎన్నికల మీటింగులకు వెళ్ళి చక్కర్లు కొట్టడం పైన కూడా ఆ పత్రిక కధనంలో రాసింది.
నాడు అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, మమతా బెనర్జీ వంటి వారితో తిరిగిన బాబు ఇపుడు మౌనంగా ఉండడం వెనక ఆయనకు ఏవో భయాలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చింది. మొత్తానికి బాబు తాజా రాజకీయ వైఖరి జాతీయ స్థాయిలో పెద్ద చర్చకే ఆస్కారం ఇస్తోందని అంటున్నారు.