ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమ్మాయిలపై దాడుల పరంపర కొనసాగుతోంది. దిశ ఘటన మరవకముందే శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో నలుగులు ఆకతాయిలు ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి ప్రయత్నించారు. యువతి ప్రతిఘటించటంతో ఆకతాయిలు యువతిని తీవ్రంగా కొట్టారు. యువతికి తీవ్రంగా గాయాలయ్యాయి. 
 
యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నలుగురు యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. యువతి సమీప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం సీతంపేటకు చెందిన యువతి రాజాంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. స్నేహితులతో కలిసి రూం అద్దెకు తీసుకొని రాజాంలో ఉంటోంది. 
 
నిన్న రాత్రి 8 గంటల సమయంలో భోజనం చేయటానికి బయటకు వచ్చిన యువతి చెయ్యి పట్టుకొని ఒకడు బలవంతంగా లాక్కొని వెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె గట్టిగా కేకలు వేసింది. కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందనే కోపంతో యువకుడు, అతని ముగ్గురు ఫ్రెండ్స్ యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించారు. 
 
పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆకాతాయిలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం యువతికి ఎటువంటి ప్రమాదం లేదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు. నిందితులను పోలీసులు ఇంకా మీడియా ముందు ప్రవేశపెట్టలేదు.  ఆ యువకులు స్థానికులు మాత్రం కాదని స్థానికులు చెబుతున్నారు. అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలని కఠిన శిక్షలు విధిస్తే మాత్రమే నేరాల సంఖ్య తగ్గుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా లైంగిక దాడులకు సంబంధించిన కేసులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: