తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరుపై మ‌రోమారు కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు, సినీన‌టి విజ‌య‌శాంతి తీవ్రంగా స్పందించారు. దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేకెతిస్తున్న `జ‌స్టిస్ ఫ‌ర్ దిశ‌` హ‌త్య‌కేసులో తెలంగాణ ముఖ్య‌మంత్రిపై ఆమె ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఆరోప‌ణ‌లు సంధించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప్ర‌జలంటే విలువే లేద‌ని....త‌న పెంపుడు కుక్క‌ల‌కు ఇచ్చిన విలువ కూడా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌డం లేద‌ని విజ‌య‌శాంతి ఆరోపించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య‌శాంతి గ‌లం విప్పారు.

 

 

సమ్మె తర్వాత విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఆదివారం సమావేశమైన త‌ర్వాత ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌స్టిస్ ఫ‌ర్ దిశ ఉదంతంపై స్పందించారు. మానవ మృగాలు మన మద్యనే తిరుగుతున్నాయని, ఇది అత్యంత దారుణమైన ఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విజ‌య‌శాంతి విరుచుకుప‌డ్డారు. ``హైదరాబాద్ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ దారుణ హత్యోదంతంపై ఎట్టకేలకు కేసీఆర్ గారు 72 గంటలు గడిచాక పెదవి విప్పడం చాలా విడ్డూరంగా ఉంది. హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఫలితం వచ్చిన వెంటనే, హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి తన సొంత డబ్బా కొట్టుకున్న సీఎం దొరగారు... మానవ మృగాల చేతిలో అమానుషంగా అత్యాచారానికి గురై...అమాయక ఆడబిడ్డ అసువులు బాసిన ఘటనపై స్పందించడానికి మూడు రోజులు తీసుకున్నారు. అది కూడా మహిళా సంఘాలు నిలదీసిన తర్వాత, జాతీయ మీడియా ఏకిపారేసిన తర్వాత, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ పేరుతో మొక్కుబడిగా ఓ ప్రకటన చేసి దొరగారు చేతులు దులుపుకున్నారు. ఈ మాటేదో వరంగల్లో మానస హత్యాచారానికి గురైన వెంటనే గాని... వెటర్నరీ డాక్టర్‌ను సజీవ దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన రోజే చెప్పి ఉంటే... దానికి విలువ ఉండేది`` అని విజ‌య‌శాంతి వ్యాఖ్యానించారు. 

 

ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు శిక్ష వేయిస్తాం అని చెప్తున్న కేసీఆర్... వెటర్నరీ డాక్టర్ కనిపించలేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కి వెళితే బాధ్యతారహితంగా మాట్లాడిన పోలీసుల వైఖరి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పలేదని విజ‌య‌శాంతి ప్ర‌శ్నించారు. ``ఇలాంటి దారుణ ఘటనలపై ఫిర్యాదు అందిన వెంటనే పరిధుల పేరుతో జాప్యం చేయకుండా పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇస్తారని కెసిఆర్ ప్రకటించలేదు. ఇలా అసలు విషయాల గురించి మాట్లాడకుండా కేవలం కంటితుడుపు చర్యగా ఓ ప్రకటన చేసి కేసీఆర్ తప్పించుకున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు... గతంలో ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా కేసీఆర్ తీరు విమర్శలకు తావిచ్చే విధంగా ఉంది. ఇప్పుడు ఆర్టీసీని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పే సీఎం దొర గారు... ఈ ప్రకటన ఏదో హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే చేసి ఉంటే బాగుండేది. కానీ కార్మికులు సమ్మె విరమించినంత మాత్రాన వీధుల్లోకి తీసుకోబోమని లేబర్ కోర్టు తీర్పు వచ్చే వరకు కార్మికులు వేచి ఉండాల్సిందేనని ఆర్టీసీ ఎండి ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది? అసలు కేసీఆర్ ఆర్టీసీని కాపాడాలనే నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలల సమయం ఎందుకు పట్టింది? ప్రగతి భవన్‌లో పెంచుకున్న పెంపుడు కుక్కకు ఇచ్చిన విలువ కూడా తెలంగాణ ప్రజానీకానికి లేదని కేసీఆర్‌పై విమర్శలు ఉన్నాయి... కానీ సీఎం దొర గారి వాలకం చూస్తుంటే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు,,, అన్న చందంగా ఉంది. ఈ దొరతనానికి చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉంది.`` అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి విరుచుకుప‌డ్డారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: