దేశ వ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలపై నేడు పార్లమెంట్ లో దద్దరిల్లింది. ముఖ్యంగా హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అకృత్యంపై దేశ వ్యాప్తంగానే కాదు.. పార్లమెంట్ లో సైతం నిరసనలు వెల్లువెత్తాయి. ప్రతిరోజూ దేశంలో ఏదో ఒక మూల చిన్నారులపై మహిళలపై కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఓ వైపు కామాంధులను బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్ పెరుగుతున్న వేళ ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని శిక్షిస్తున్నారు. ఇటీవల తెలంగాణలో హన్మకొండలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా గొంతు నులిమి చంపాడు ఓ రాక్షసుడు. ఇలా మరికొంత మంది చిన్నారులపై కృరమృగాలు ఇలాగే రెచ్చిపోయారు.
దొరికితే దొంగ.. లేదంటే దొర అన్న చందంగా ఈ కృరమృగాల అకృత్యాలు సాగుతున్నాయి. అయితే ఇలాంటి దారుణాలకు పాల్పపడే కామాంధులకు సరైన శిక్షలు లేకపోవడం వల్లే ఇలా రెచ్చిపోతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని చితక్కొట్టి వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. నాగ్పూర్కు చెందిన వైద్య అనే వ్యక్తి స్థానిక కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్లో కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. డబ్బు అప్పుగా తీసుకున్న వారి ఇంటికి వెళ్లి ప్రతిరోజూ వాయిదాలు కలెక్షన్ చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే రోజూ ఓ ఇంటికెళ్లి డబ్బులు కలెక్ట్ చేసేవాడు. ఇదే సమయంలో వారి కుటుంబంతో మంచి పరిచయం ఏర్పర్చుకున్నాడు.
ఇదే సమయంలో వారింట్లో ఓ చిన్నారికి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇస్తూ దగ్గర అయ్యాడు. ఆదివారం డబ్బుల కోసం వారి ఇంటికెళ్లిన సమయంలో ఇంట్లో పెద్ద వాళ్లెవరు లేదు. దీంతో వైద్య బాలికను మభ్యపెట్టి అత్యాచారానికి యత్నించాడు. ఒక్కసారే భయపడిపోయిన ఆ పాప కేకలు వేయడంతో తల్లి ఇంట్లోకి వచ్చింది. బాలికతో అసభ్యకర రీతిలో కనిపించిన వైద్య చెంపలు వాయిస్తూ బయటకు లాక్కెళ్లింది. అప్పటికే స్థానికులు అక్కడికి చేరుకోవడం విషయం తెలుసుకొని కోపోద్రిక్తులయ్యారు. కాళ్లు చేతులు కట్టేసి వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాదు పోలీసులు వైద్య పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..కాగా, అలాంటి నీచులకు సరైన బుద్ది చెప్పారని నెటిజన్లు అంటున్నారు.