జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున్నే చర్చ జరుగుతోంది. ప్రధానంగా పవన్ వివాహ జీవితం గురించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం పవన్ వాటికి కౌంటర్ ఇవ్వడం...ఈ క్రమంలో ఇరు పక్షాలు పరుషమైన పదాలు వాడటం తెలిసిన సంగతే. ఈ వాదోపవాదాల్లో పవన్ మాజీ భార్యల్లో ఒకరైన సినీ నటి రేణుదేశాయ్ గురించి కూడా పలువురు ప్రస్తావిస్తుంటారు. దానికి పవన్ తనదైన శైలిలో సమాధానం ఇస్తుంటారు. అయితే, తాజాగా మరోమారు పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది. గత కొద్దికాలంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై పవన్ మండిపడుతున్నారు. తెలుగు భాష అంతర్థానం అయ్యే పరిస్థితి ఉందని పవన్ పేర్కొంటున్నారు. ఈ ఉదంతం పవన్ ఈ రోజు కీలక చర్యకు శ్రీకారం చుట్టి అధికార వైసీపీని టార్గెట్ చేయగా....ఆ పార్టీ సైతం అదే రీతిలో స్పందించింది.
పవన్ కళ్యాణ్ తన రాయలసీమలో జనసేన ఆత్మీయ యాత్రలో భాగంగా తిరుపతిలో తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశాన్ని ‘తెలుగు వైభవం’ పేరిట నిర్వహించారు. ఈ సమావేశంలో విశ్రాంతి ఐఏఎస్ అధికారి, అవధానులు, పండితులు, ప్రొఫెసర్లు, భాషాభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ...ఒకే భాష మాట్లాడే వారికి ఒకే రాష్ట్రం ఉండాలని పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్న నాయకులు.. తెలుగు భాషను పరిరక్షించుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారన్నారు. తెలుగు భాష... జ్ఞాన సరస్వతి.. అలాంటి భాషామూలలను చంపేయాలని చూస్తే ఆ జ్ఞాన సరస్వతే.. అపర దుర్గదేవిగా అవతారమెత్తి మిమ్మల్ని సర్వనాశనం చేస్తుందని పరోక్షంగా ఏపీ సర్కారును పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
అయితే, దీనిపై వైసీపీ ఘాటుగా స్పందించింది.తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ పవన్పై మండిపడ్డారు. ``పవన్ ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నందుకు బాధపడుతున్నాడంట. పవన్...అంత బాధపడేవాడివి నీ కుమారుడుని ఓక్రిడ్జ్ స్కూల్లో ఆంగ్ల మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు? తెలుగు మీడియం ఉన్న పాఠశాలలో చేర్చవచ్చు కదా? మీకు ముగ్గురో,నలుగురు పిల్లలు ఉన్నారు. వారిని తెలుగుమీడియంలో చేర్చవచ్చుకదా?అలా ఎందుకు చేయవు? పేదవారి పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో, మీ పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో చేర్చుకోవాలా?`` అని ప్రశ్నల వర్షం కురిపించారు.