ఫిర్యాదుల విషయంలో ఏపీ పోలీసులు కీలక సంస్కరణకు తెర తీశారు. ప్రజలు చేసే ఫిర్యాదులకు సంబంధించి ‘0’ (జీరో) ఎఫ్‌ఐఆర్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. డీజీపీ  గౌతమ్ సవాంగ్ ఈమేరకు ఆదేశాలు కూడా జారీచేశారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్ లో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ ట్రైనర్స్ వర్క్ షాప్‌ ప్రారంభోత్సవంలో డీజీపీ గౌతమ్ సవాంగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 

 

 

ఈ జీరో ఎఫ్ఐఆర్ విధానం ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాల్లో అమలులో ఉంది. ఇదే తరహాలో ఇకపై రాష్ట్రంలో కూడా జీరో ఎఫ్‌ఐఆర్‌ను అమలు చేయాలని సూచించారు. ఈ విధానం అమల్లో ఉంటే.. ఇకపై స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని పోలీసు స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేసే అవకాశం కలుగుతుంది. తమ పరిధి కాదంటూ పోలీసులు బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి వీలుండదు. ఫిర్యాదును స్వీకరించి.. విచారణ జరిపి.. సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్‌కు ఈ ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాలకు అందే ఫిర్యాదులు పోలీసులకు అందేలా అనుసంధానం చేస్తున్నామని, జీరో ఎఫ్‌ఐఆర్‌ను ఖచ్చితంగా అమలుచేయాలని అన్ని జిల్లాల ఏస్పీలకు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామని సవాంగ్ వెల్లడించారు.

 

 

పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం ఇప్పటి వరకూ జ్యూరిస్డిక్షన్ అంశం కీలకంగా ఉంది. దీని వల్ల పలు కేసుల్లో ఫిర్యాదుదారులకు ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. దీనిపై పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉన్నా.. కొన్నిసార్లు కేసు నమోదు చేసి బదిలీ చేస్తూంటారు. ప్రస్తుత డీజీపీ నిర్ణయంతో బాధితుల ఫిర్యాదులపై సత్వరమే ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉంది. విధుల్లో ఎటువంటి రూల్స్ అడ్డంకి కాకుండా ఏపీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: