ఆర్టీసీ కార్మికులు 55 రోజులపాటు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెకాలంలో ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. రవాణా స్తంభించి పోయింది. కోట్లాది రూపాయల నష్టం వచ్చింది ఆర్టీసీకి. 55 రోజులపాటు సమ్మె చేసిన కార్మికులను ఎట్టకేలకు తిరిగి ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. వీరిని విధుల్లోకి తీసుకోవడమే కాకుండా సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతాలను కూడా ప్రభుత్వం ఈరోజు చెల్లించింది. సమ్మె చేసిన కార్మికులకు చల్లని వార్త చెప్పిన ప్రభుత్వం, ప్రజల నెత్తినపై వెయ్యి కోట్ల రూపాయల భారం మోపింది.
కిలోమీటర్ కు 20 పైసలు పెంచారు. దీంతోపాటు కనీస ఛార్జి ఐదు నుంచి పది రూపాయలకు పెంచారు. పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో కనీస ఛార్జి రూ. 10 రూపాయలు కాగా, డీలక్స్, సూపర్ డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జి రూ, 20, రూ. 25కు పెరిగింది. అలానే, ఏసీ రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో కనీస ఛార్జ్ రూ.35, వెన్నెల స్లీపర్ బస్సుల్లో కనీస ఛార్జ్ రూ. 70 కి పెరిగింది. వీటితో పాటుగా రోజువారీ బస్సు పాస్ లు, నెలవారీ బస్సు పాసుల ధరలు కూడా అమాంతం పెరిగాయి.
పెంచిన చార్జీల మోతతో రాష్ట్రంలో ప్రజలపై దాదాపుగా రూ. వెయ్యి కోట్ల రూపాయల భారం పడబోతున్నది. ఈ భారం కారణంగా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడబోతున్నారు. ఈ స్థాయిలో ప్రజలపై భారం పడటంపై కాంగ్రెస్ పార్టీ నేతలు బయటకు వచ్చి నినాదాలు చేస్తున్నారు. ప్రజా సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీయిస్తామని కెసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తామని చెప్తున్న కెసిఆర్, ఇప్పుడు ప్రజలపై ఆర్టీసీ చార్జీలను పెంచడం సరికాదని అన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను ప్రభుత్వం తక్షణమే తగ్గించి ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రజలపై వెయ్యికోట్ల రూపాయల భారాన్ని మోపడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఇక పెంచిన చార్జీలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తున్నాయి.