అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా 52 రోజులు సమ్మె చేశారు. ఈ సమ్మెలో భాగంగా కార్మికులు 26 రకాల డిమాండ్లు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. కానీ, ఏ ఒక్క డిమాండ్ నెరవేరలేదు. పైగా సమ్మె చేస్తున్న సమయంలో ప్రభుత్వం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. సమ్మె చేస్తున్న సమయంలో ప్రజల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. సమ్మె కారణంగా ఆర్టీసీ కోట్లాది రూపాయలు నష్టపోయిన సంగతి తెలిసిందే.
ఈ నష్టాన్ని భరాయించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. సమ్మె చేస్తున్న కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ చేస్తున్నట్టు చెప్పారు. సెల్ఫ్ డిస్మిస్ చేసి వారి స్థానంలో కొత్తవాళ్లను తీసుకోవాలని, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని అన్నారు. కానీ, అవన్ని పక్కన పెట్టి 55 రోజుల తరువాత ఎట్టకేలకు కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. విధుల్లోకి తీసుకోవడమే కాకుండా, వాళ్లకు సెప్టెంబర్ మాసం జీతాలు చెల్లించారు. అంతేకాదు, ఇప్పుడు వాళ్లకు సమ్మె చేసిన సమయంలో చెల్లించాల్సిన సొమ్మును కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం.
దీంతో పాటు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు వారలు కురిపించింది. ఈ వరాలతో కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండబోతున్నాయి. కార్మికుల వరకు బాగానే ఉన్నది. ఎప్పుడైతే కార్మికులకు వరాలు ప్రకటించారో అప్పటి నుంచి ప్రజల నెత్తిపై బాదుడు మొదలైంది. ఈ బాదుడు కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చార్జీలు భారీగా పెంచడంతో ప్రజల జేబులకు చిల్లుకు పడబోతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఒక ఊరు నుంచి మరో ఊరికి ప్రయాణం చేయాలి జేబులో అదనంగా వంద రూపాయలు ఛార్జీలకు ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం ఒక్కో టికెట్ పై 20 నుంచి 50 రూపాయల వరకు పెరిగాయి. మొన్నటి వరకు సమ్మె చేస్తున్న సమయంలో ప్రజలు ప్రైవేట్ వాహనాల కోసం డబ్బులు ఖర్చు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచడంతో రోజు అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. హతవిధీ.