తెలంగాణ ఆర్టీసీని ఎలాగైనా లాభాల్లోకి తీసుకురావాలని కెసిఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. సమ్మె ముందు వరకు సైలెంట్ గా ఉన్న కెసిఆర్, ఎప్పుడైతే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారో అప్పటి నుంచి ఆర్టీసీపై దృష్టి పెట్టారు. మొదట కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించి వారికీ షాక్ ఇచ్చారు. కొన్ని రోజుల తరువాత వారిపై దయచూపిస్తూ.. కార్మికులు సమ్మె విరమించాలని చెప్పి కోరారు. కానీ, కార్మికులు ససేమిరా అనడంతో.. కెసిఆర్ కు కోపం వచ్చింది.
ఈ కోపాన్ని బహిరంగంగా ప్రదర్శించకుండా కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా కొంతవరకు కార్మికులకు అనుకూలంగానే మాట్లాడింది. కాగా, ప్రభుత్వం చివరి అస్త్రంగా ఆర్టీసీలో 5100 రూట్లను ప్రైవేట్ రూట్లగా మార్చేందుకు రెడీ అవుతున్నట్టు ప్రకటించింది. అంతే, ఆర్టీసీలో అలజడి మొదలైంది. కార్మికులు డిమాండ్లను పక్కన పెట్టి విధుల్లోకి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 53 రోజుల తరువాత సమ్మె విరమిస్తే.. రెండు రోజులు సస్పెన్స్ లో పెట్టి ప్రభుత్వం తిరిగి వారిని విధుల్లోకి తీసుకుంది.
అంతవరకూ బాగానే ఉన్నది. సమ్మె విరమించిన వ్యక్తులను విధుల్లోకి తీసుకొని ప్రభుత్వం ప్రయాణికులపై పెనుభారం వేసింది. దాదాపుగా సంవత్సరానికి వెయ్యికోట్లల వరకు భారం పడనుంది. పెంచిన చార్జీలు ఈరోజు నుంచి అమలు కాబోతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నది. పెంచిన చార్జీలను లెక్కచూసుకుంటే.. ఇంకా పదిశాతం నష్టాలు ఉంటాయట. ఆ పదిశాతం నష్టాలు కూడా పోయి ఆర్టీసీ బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి రావాలి అంటే మరోసారి చార్జీలుపెంచాలి.
దీనిపై కూడా ఆర్టీసీ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది మరోసారి చార్జీలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు పెరిగిన చార్జీలతో పాటు వచ్చే ఏడాది నుంచి కూడా చార్జీలు పెరుగుతాయి కాబట్టి ప్రయాణికులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉంటె మంచిది. ఎందుకంటే, ఎక్కడికి వెళ్లాయి అన్నా ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలనంటే బస్సుల్లో వెళ్ళాలి. ప్రభుత్వం చార్జీలు ఎంత పెంచినా తప్పదు కదా. కెసిఆర్ గారు ఆర్టీసీని ఇలా లాభాల్లోకి తెస్తున్నారన్నమాట.