తెలంగాణాలో విపక్షాలు ప్రతీ విషయంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాయా ? బహుశా ఆర్టీసి సమ్మె తర్వాత ఈ ప్రశ్న నిజమే అనిపిస్తుంది. ఆ స్థాయిలో సమ్మె జరిగితే ఒక్క నేత అంటే ఒక్క నేత కూడా నిరాహారదీక్ష గాని, ధర్నాలో పాల్గొనడం గాని కార్మికుల పోరాటంలో చివరి వరకు ఉండటం గాని చేయలేకపోయారు. ఇలా చూస్తూ పోతే తెలంగాణాలో విపక్షాలు ప్రతీ విషయంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. వాళ్ళల్లో వాళ్ళు తన్నుకోవడం, కెసిఆర్ చేతిలో ప్రతీ అస్త్రాన్ని స్వయంగా వాళ్ళే ఏదోక సందర్భంలో అందించడం, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలం కావడం అనేవి జరుగుతూనే ఉన్నాయి.
తెలంగాణాలో ఉన్న సమస్యలు ఏ రాష్ట్రంలోను లేవు. ఒక్క కార్యక్రమం కూడా అక్కడ విజయవంతంగా అమలు కావడం లేదని ఎన్నికల సమయంలో చాలా మంది ఆరోపించారు. కెసిఆర్ ని నెత్తిన పెట్టుకున్న మూడు జిల్లాలు కూడా ఆయన చల్లని చూపు నోచుకోవడం లేదని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించాయి. కాని తెలంగాణా సెంటిమెంట్ తో కెసిఆర్ విజయం సాధించారు. ఆయన రెండో సారి ముఖ్యమంత్రి అయి ఏడాది కావొస్తుంది. ఈ ఏడాదిలో ఎన్నో సమస్యలు వచ్చాయి..
విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీసి సమ్మె, పసుపు రైతులు ఇలా ఎన్నో సమస్యలు ప్రజలు లేవనెత్తారు. చివరకు కెసిఆర్ కుమార్తె కూడా ఓడిపోయారు... అయినా సరే వాటిల్లో ఏ ఒక్కటి కూడా అక్కడి విపక్షాలు ఉపయోగించుకోవడం లేదు. ఎవరైనా ముందుకి వచ్చి మాట్లాడితే... వారిని సోషల్ మీడియాలో బద్నాం చేయడం వంటివి జరుగుతున్నాయి. ఆర్టీసి సమ్మె అనేది విపక్షాలకు కల్పతరువు దాన్ని కూడా వాడుకోలేక పోయారు విపక్ష నేతలు. దీన్ని బట్టి చూస్తే అక్కడ విపక్షాలకు ఇక భవిష్యత్తు లేదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.
కాంగ్రెస్ పార్టీకి ఉన్న కీలక నేతలు తమ రాజకీయ భవిష్యత్తు నేపథ్యంలో ఇతర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. దీంతో కేడర్ బలంగా ఉన్నా సమర్థులైన నాయకుల కొరతతో పాటు ప్రతి ఒక్కరు తామే లీడర్లం అని ఫీలవుతుండడం ఆ పార్టీకి మైనస్. బీజేపీకి పేరున్న లీడర్లు ఉన్నా బలమైన కేడర్ లేని పరిస్థితి. దీనిని కేసీఆర్ చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు.