సంక్షేమ రథాన్ని పరుగులు తీయిస్తున్న ఏపీ సీఎం జగన్.. పేదల కోసం మరో వరం ప్రకటించారు. ఇప్పటి వరకూ ఇస్తున్న రేషన్ బియ్యం స్థానంలో నాణ్యమైన బియ్యం ఏప్రిల్ నుంచి ఇవ్వబోతున్నారు. దీని ద్వారా పేదలకు కూడా నాణ్యమైన ఆహారం లభించే అవకాశం కలుగుతోంది. ఈ అంశంపై ఆయన సోమవారం అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు.

 

వచ్చే ఏప్రిల్‌ నుంచి మిగిలిన అన్ని జిల్లాల్లో నాణ్యమైన, ప్యాకేజ్డ్‌ బియ్యాన్ని పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో సంబంధిత శాఖ మంత్రి కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం అమలవుతున్న నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీ పైలట్‌ ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి తొలుత సమీక్షించారు.

 

దీనికి సంబంధించిన పలు వివరాలను అధికారులు సీఎంకు నివేదించారు. నాణ్యమైన, ప్యాకేజ్డ్‌ బియ్యంపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ బాగుందని సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
రైతులనుంచి బియ్యం సేకరణ, ప్యాకేజ్డ్‌ యూనిట్ల ఏర్పాటు, గోడౌన్లలో బియ్యాన్ని భద్రపరుస్తున్న తీరు తదితర అంశాలను సమీక్షించారు.

 

ఎక్కడా కూడా అలసత్వానికి దారి తీయకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి లబ్ధిదారుడి ఇంటికీ నాణ్యమైన బియ్యాన్ని∙మంచిగా ప్యాక్‌చేసి అందించాలని నిర్దేశించారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని స్పష్టం చేశారు.
ప్రతి దశలోనూ బియ్యం నాణ్యతను పరిశీలించే ఏర్పాటు ఉండాలని.. బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ప్లాస్టిక్‌ బ్యాగులను తిరిగి వెనక్కి ఇచ్చేసేలా అవగాహన కల్పించాలని లేకపోతే ఆ బ్యాగుల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: