మహిళలను అపహరించి క్లబ్ డ్యాన్సర్లుగా వ్యభిచారిణులుగా మారుస్తున్న ఓ దుర్మార్గుడి జాడను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ పోలీసులు కనుగొన్నారు. అయితే పోలీసులకు విషయం తెలిసిందని ముందే పసిగట్టిన అతను పారిపోగా..నిందితుడి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇండోర్ నగరానికి చెందిన జితేందర్ సోని ‘సంజ లోక్ స్వామి’ పేరిట ఈవినింగ్ న్యూస్పేపర్తో పాటు నైట్ క్లబ్ నిర్వహిస్తున్నాడు. అయితే అతడి క్లబ్పై అనేక ఆరోపణలు రావడంతో పోలీసులు పత్రికా కార్యాలయంతో పాటు నైట్ క్లబ్పై పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు.
ఈ సందర్భంగా 67 మంది బార్ డాన్సర్లను కాపాడారు. వారంతా అపహరించినవారేనని తెలుస్తోంది.
తమను బెదిరించి క్లబ్ల్లో డ్యాన్సర్లుగా మార్చాడని మహిళలు వాపోతున్నారు. వారు చెప్పిన విషయాలు పోలీసులను విస్మయానికి గురి చేశాయి. వారివారి అడ్రస్లు కనుక్కుని వారి స్వస్థలాలకు పంపిచే ఏర్పట్లను పోలీసులు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్న మహిళలందరినీ మహిళా సదనానికి తరలించారు.
జితేందర్ అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి అనేక మంది మహిళలను ఇండోర్ తీసుకువచ్చి బలవంతంగా బార్ డాన్సర్లుగా మార్చినట్లు ఆరోపణలున్నాయని ఇండోర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ రుచివర్ధన్ మిశ్రా చెప్పారు. అయితే ప్రస్తుతం బార్ డ్యాన్సర్లుగా పోలీసులు గుర్తించిన వారిలో కొంతమంది చేత వ్యభిచారం కూడా చేయిస్తున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. పోలీసుల దాడులను ముందే పసిగట్టిన జితేందర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, ఆయన కొడుకు అమిత్ సోనీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి సంజ లోక్స్వామి పత్రికా కార్యాలయాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. జితేందర్ వ్యభిచారం నిర్వహించే విధానంపై ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్నారు. జితేందర్ కాల్ డేటా ఆధారంగా మరికొంతమంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.