హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. హైదరాబాద్లోని శంషాబాద్ సమీపంలో జరిగిన దిశ దారుణ ఉదంతంపై సోమవారం పార్లమెంట్ అట్టుడికింది. పశు వైద్యురాలిపై లైంగిక దాడి, హత్యను పార్టీలకతీతంగా ఎంపీలందరూ ముక్తకంఠంతో ఖండించారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని, శిక్షను సత్వరం అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల మహిళలపై లైంగిక నేరాలు పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఎక్కడా భద్రత సరిగా లేదని రాబర్ట్ వద్రా ఆరోపించారు. ఆయన తన ట్విట్టర్లో ఈ కామెంట్ చేశారు.
ఇటీవల కొందరు వ్యక్తులు కారులో నేరుగా ప్రియాంకా గాంధీ ఇంట్లోకి దూసుకువెళ్లారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. రాబర్ట్ వద్రా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇది ప్రియాంకా గాంధీ, నా కూతురు, కుమారుడు, గాంధీ ఫ్యామిలీకి చెందిన భద్రత విషయం కాదు అని, ఇది పౌరులకు భద్రత కల్పించాల్సిన అంశం` అని అన్నారు. దేశవ్యాప్తంగా సెక్యూర్టీ విఫలమైనట్లు చెప్పారు. ఇటీవల గాంధీ ఫ్యామిలీకి ఎస్పీజీ భద్రతను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దేశంలోని మహిళలు సురక్షితంగా లేరని, అమ్మాయిలపై వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, ఎటువంటి సమాజాన్ని మనం సృష్టిస్తున్నామని రాబర్ట్ ప్రశ్నించారు. మన దేశంలో, మన ఇళ్లల్లో, మన రోడ్లపై, పగలూ రాత్రి క్షేమంగా లేకుంటే.. మరి వాళ్లు ఎప్పుడు, ఎక్కడ క్షేమంగా ఉంటారన్నారు. ప్రతి పౌరుడికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.
కాగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి లోక్సభలో మాట్లాడుతూ.. 112 ఎమర్జెన్సీ హెల్ప్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. 112 ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నంబర్ దేశ వ్యాప్తంగా అమలవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 112 హెల్ప్లైన్కు సంబంధించి రాష్ర్టాలకు నిధులు కూడా మంజూరు చేశామని ఆయన తెలిపారు. రైల్వే స్టేషన్ల వద్ద జీఆర్పీ, పోలీసులు, విమానాశ్రయాల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలు భద్రతను కల్పిస్తున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.112.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్. మీరు ఎమర్జెన్సీ సమయంలో ఈ ఒక్క నెంబర్ కు ఫోన్ చేస్తే చాలు.. క్షణాల్లో స్పందించి మీకు తక్షణ సాయం అందించే అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ERSS) కింద 112 ఏకైక ఎమర్జెన్సీ నెంబర్ ను లాంచ్ చేశారు. సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (CDAC)ఈ హెల్ప్ లైన్ నంబర్ టెక్నాలజీని డిజైన్ చేసింది.