ప్రాంతాలతో సంబంధం లేదు....వయసు గురించి ఆలోచించే సభ్యత లేదు...పట్టణం పల్లె అనే తేడా లేదు. దేశంలో ప్రతి రోజూ ఏదో ఒక మూలన ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారాలు.. హత్యలతో మానవ మృగాలు చెలరేగిపోతున్నాయి. ఈ మృగాల ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. మూడు చోట్ల జరిగిన మూడు దారుణ ఘటనలు...మరోమారు మహిళల భద్రతపై కలవరాన్ని సృష్టిస్తున్నాయి. అమ్మాయిపై అత్యాచారం చేసేందుకు యత్నించిన ఓ యువకుడిని అడ్డుకుని జైలుకు పంపినందుకు.. ఆమెపై పగ పెంచుకుని ప్రతీకారంగా అత్యంత దారుణంగా చంపేశాడు ఓ దుర్మార్గుడు. మరోచోట 55 ఏళ్ల ఒంటరి మహిళపై అత్యాచారం చేసిన దుండగులు ఆపై ఆమెను దారుణంగా హత్య చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో కామాంధుడు.
తప్పుడు పనిని అడ్డుకున్నందుకు ఓ యువతి దారుణ పరిస్థితిని ఎదుర్కున్న ఘటన మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలో జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్లో 19 ఏళ్ల యువకుడు ఒకడు 17 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి యువకుడిని జైలుకు పంపించారు. పది రోజుల క్రితం యువకుడు బెయిల్పై విడుదలయ్యాడు. అయితే ఆ యువతిపై పగ పెంచుకున్న.. యువకుడు ఆమెను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రెండు, మూడు రోజుల పాటు యువతి ఇంటి వద్ద రెక్కి నిర్వహించాడు. సోమవారం యువతి తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు.. ఆ ఇంటిలోకి దూరాడు యువకుడు. ఆ తర్వాత యువతిపై విచక్షణారహితంగా 30 కత్తిపోట్లు పొడిచి దారుణంగా చంపేశాడు. కత్తిపోట్లు భరించలేని బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడకు వచ్చారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ప్రతీకారంగానే ఆ యువతిని చంపేశానని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అయితే, ఓ అబల అకారణంగా కన్నుమూసింది.
ఇక తూర్పు గోదావరి జిల్లా, వేమవరంలో దారుణం చోటుచేసుకుంది. 55 ఏళ్ల ఒంటరి మహిళపై అత్యాచారం చేసిన దుండగులు ఆపై ఆమెను దారుణంగా హత్య చేశారు. మృతదేహం చుట్టూ కారం చల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.ఈ దారుణంలో పోలీసులు ముగ్గురిని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, హైదరాబాద్ బంజారాహిల్స్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టారని కారుతో ఢీకొట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఇవాళ ఉదయం బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్గా పని చేస్తున్న బాధితురాలు తనకు ఎదురైన ఇబ్బందిని పోలీసులకు వివరించింది. ముగ్గురు మహిళలు, ఇద్దరు యువకులతో ఉన్న ఓ కారు తనను ఢీకొట్టిందని...రులో ఉన్న వారిని తనను ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించగా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలాడారని వాపోయింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.