దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దిశ అత్యాచారం, హత్యకేసులో నిందితులను పోలీసుల కస్టడీకి అప్పగించింది కోర్టు. ఇంకా విచారణ జరపాల్సి ఉందన్న పోలీసుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కోర్టు నిందితులకు 10 రోజుల కస్టడీని విధించింది.
దిశ కేసులో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసంర ఉందని నిందితుల కస్టడీ కోరుతూ... షాద్నగర్ పోలీసులు పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా... నిందితుల దగ్గర నుంచి మరింత సమాచారం తెలుసు కోవాల్సిఉందని కోర్టుకు తెలిపారు పోలీసులు. దిశ కేసులో నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించే రోజు వేలాది మంది పోలీస్ స్టేషనుకు చేరుకోవడంతో నిందితుల నుంచి పూర్తి వివరాలు తీసుకోలేదని తెలిపారు.
అందువల్ల నిందితులను పది రోజులు కస్టడీకి అనుమతి ఇస్తే వారిని మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు పోలీసులు. ఘటనలో మిస్సయిన మొబైల్ ఫోన్ రికవరీ చేయాల్సి ఉందని.. అదే విధంగా నిందితుల స్టేట్ మెంట్ రికార్డు చెయ్యాల్సి ఉందని పిటిషన్లో వెల్లడించారు. మరోవైపు దిశ హత్యాచారం కేసులో విచారణ ఖైదీలుగా చర్లపల్లి జైలులో ఉన్న నిందితులు మహ్మద్ ఆరిఫ్ పాషా, శివ, నవీన్ చెన్నకేశవులకు సింగిల్ సెల్లో ఉంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వారి ఆరోగ్య పరిస్థితులను జైలు వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నిందితులపై జైలు లోపల ఇతర ఖైదీల నుంచి ఎలాంటి దాడులు జరగకుండా అధికారులు ఎనిమిది మంది వార్డర్లను, ఇద్దరు హెడ్ వార్డర్లను ప్రత్యేకంగా నియమించారు. శనివారం రాత్రి నిందితుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి మహనది బ్లాక్లోని సింగిల్సెల్లను కేటాయించారు. దీన్ని నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు జైలు అధికారులు.
అంత నేరం చేశామనే బావన నిందితుల్లో ఏమాత్రం కనిపించడం లేదంటున్నారు అధికారులు. భోజన విరామ సమయంలో నలుగురిని జైలు వరండాలో అటూ ఇటూ తిప్పి నిందితుల కదలిక గురించి పరిశీలించారు. వారిలో మార్పులు కానీ, ముఖంలో భావోద్వేగాలు కానీ కనిపించలేదని తెలిపారు జైలు సిబ్బంది. ఇదిలా ఉండగా... నిందితులను కోర్టు వద్దకు తీసుకువస్తున్న సమయంలో న్యాయవాదులంతా దిశకు మద్దతు తెలిపారు. షాద్నగర్, మహబూబ్నగర్లో ఏ న్యాయవాది కూడా నిందితులకు న్యాయ సహాయం చేయకూడదని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. జస్టిస్ ఫర్ దిశకు ప్రతి ఒక్క న్యాయవాది మద్దతు ఇవ్వాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.