ఏపీ పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను కృష్ణాజిల్లా కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళ సోమవారం నుంచి కనిపించడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరగ్గా.. ఆమె కంచికచర్లలో ఉన్నట్లు తేలింది. 

మహిళ టీడీపీ సానుభూతిపరురాలు కావడంతో అరెస్ట్ గురించి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ దగ్గరకు భారీగా చేరుకున్నారు. సౌమ్య, టీడీపీ నేతలు స్టేషన్‌కు వచ్చిన కొద్దిసేపటి తర్వాత మహిళను పోలీసులు బెయిల్‌ పై విడుదల చేశారు. మంత్రి కొడాలి నాని పై పద్మ అనే మహిళ  మంగళగిరిలో అనుచిత వ్యాఖ్యలు చేశారని.. కంచికచర్ల మండలం గొట్టెముక్కల గ్రామానికి చెందిన మంగళపూడి ముక్తేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు సీర్‌పీసీ 41 కింద నోటీసులు జారీ చేసి మంగళవారం అరెస్ట్ చేశారు. 

ఈ ఘటనపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. మంత్రి కొడాలి నాని తీరును తప్పుబట్టిన మహిళను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కొడాలి నాని బూతులు పోలీసులకు కనిపించలేదా.. మంత్రి వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నాని చంద్రబాబు పై ఇష్టానుసారంగా మాట్లాడారని.. దీన్ని తట్టుకోలేక ఓ మహిళ బాధపడి మంత్రి తీరును తప్పుబట్టిందన్నారు. ఆమె పై చర్యలు తీసుకున్న పోలీసులు.. మంత్రి నాని పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

గత నెల 26న రాజధానిలో రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక రైతులతో కలసి పద్మ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో మహిళ మంత్రి కొడాలి నాని గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: