ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ... రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పాలేరుల్లా వేమూరి రాధాకృష్ణ, పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సోమ వారం పీలేరుకు శ్రీకాంత్రెడ్డి తిరుమల పాదయాత్ర చేరుకుంది.
ఆయన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి స్థానిక శ్రీకృష్ణ దేవరాయ నూనెవిత్తుల కర్మాగారంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రైతులు పంటలు పండించుకుంటూ ఆనందంగా ఉన్నారన్నారు. గతంలో వైఎస్.రాజశేఖరరెడ్డి రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలుచేశారని తెలిపారు. కానీ చంద్రబాబు వందల హామీలు ఇచ్చి ఒక్కటీ కూడా నెరవేర్చకపోయినా పవన్ కల్యాణ్ నోరెత్తకపోవడం ఆయన పాలేరుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
ఆరు నెలల్లోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టి అమలు చేస్తుండడంతో జీర్ణించుకోలేని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన తొత్తులైన పవన్ కల్యాణ్, వేమూరి రాధాకృష్ణ ప్రభుత్వంపై బురద చల్లే పనిలో పడ్డారని ఆరోపించారు. పవన్, రాధాకృష్ణ ఇద్దరూ చంద్రబాబునాయుడుని కాపాడేందుకు కష్టపడుతున్నారని ఆరోపించారు.నాయకుడంటే ప్రజల పక్షాన మాట్లాడాలని, రాష్ట్రంలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ ను ప్రజలు ఛీ కొట్టినా సిగ్గురాకపోవడం దురదృష్టకరమన్నారు. రాధాకృష్ణకు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎంత దోచి పెట్టాడో తెలుసన్నారు. ఇక పవన్ కల్యాణ్కు ఇప్పుడు దోచుకోడానికి అవకాశం లేకపోవడంతో బురదజల్లుతున్నారని తెలిపారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వ చీఫ్విప్ శ్రీకాంత్రెడ్డి చేపట్టిన తిరుమల పాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు. సోమవారం ఆయన స్థానిక శ్రీకృష్ణదేవరాయ నూనెవిత్తుల కర్మాగారం వద్ద శ్రీకాంత్రెడ్డి, ఇతర నాయకులకు శాలువాలు కప్పి అభినందించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు జగన్మోహన్రెడ్డి, వెంకట్రమణారెడ్డి, నాయకులు హరీష్ రెడ్డి, గజ్జల శీన్రెడ్డి, కడప గిరిధర్రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, కంభం సతీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.