దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న దిశ అత్యాచారం ఘటనపై...నేతలు తమ ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలపై అఘాయిత్యాలు జరగడం పట్ల అనేకమంది కలవరపాటుకు గురవుతున్నారు. సహజంగానే ప్రభుత్వ చర్యలపై అందరి దృష్టి పడుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యనేత, రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్రావు దిశ ఘటనపై స్పందించారు. దిశపై జరిగిన అఘాయిత్యం చాలా బాధ కలిగించిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని ఆయన స్పష్టంచేశారు.
తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. మగ పిల్లలకు సంస్కారంతో కూడిన విద్యను అందించాలని సూచించారు. తల్లిదండ్రులు ఆడ పిల్లలపై కంటే మగ పిల్లలపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. మగపిల్లలు ఏం చేస్తున్నారన్న విషయంపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా పెట్టి పర్యవేక్షిస్తుండాలని మంత్రి సూచించారు. టీవీ సీరియల్స్, మొబైల్ ఫోన్స్కు విద్యార్థులు దూరంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు తీసుకునే శ్రద్ధ, వారికి విలువలు నేర్పించే విధానమే రేపటి సమాజంలో ఉత్తమ పౌరులను తీర్చిదిద్దుతుందన్నారు.
కాగా, సిద్దిపేట నియోజకవర్గంలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల వివరాలు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల వెబ్సైట్, ప్రత్యేక యాప్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... క్యాన్సర్వంటి వ్యాధులు పెరుగుతుండటానికి కారణం మనం తీసుకునే కలుషిత ఆహారం నీరు, గాలి కారణమని చెప్పారు. విచ్చల విడిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతూ పంటలు పండించడం వల్ల క్యాన్సర్ కేసులు ఎక్కువవుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో సేంద్రీయ ఆహార ఉత్పత్తులపై మక్కువ ఏర్పడిందన్నారు. సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం https://siddipetorganicproducts.com/ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ ద్వారా సేంద్రీయ ఉత్పత్తులను దేశంలో ఏ మూల నుంచి అయినా కొనవచ్చన్నారు.