ఒక వైపు అవినీతిని రూపుమాపుదామని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ దశలో అవినీతికి పాల్పడుతున్న వారిపై అత్యాయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాని మనుషుల్లో మార్పు రావడం లేదు. భయపడి తగ్గవలసింది పోయి రోజు రోజుకు ముదిరి పోతున్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్మే దక్కని ఈ రోజుల్లో ఇలా తేరగా వచ్చిన సొమ్ముతో ఏం సుఖపడుదామను కుంటున్నారో అవినీతి పరులు. వీళ్ల భాగోతం భయటకు తెలిస్తే పరువుపోతుందనే ఆలోచన కూడా కలగడం లేదు.

 

 

ఇకపోతే కర్నూలు జిల్లా సంజామల తహశీల్దార్ గోవింద్‌సింగ్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంపై సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అక్రమాస్తులను ఏసీబీ అధికారులు వెల్లడించారు. వాటి విలువ రూ. 10 కోట్లు అని తెలిపారు. ఇక ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం కర్నూలు నగరంలోని కృష్ణానగర్‌లో ఉన్న తహసీల్దార్ గోవింద్‌సింగ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదుతో పాటుగా, బంగారు ఆభరణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలు లభించాయి.

 

 

ఇకపోతే ఓ వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా గత అక్టోబర్ 7వ తేదీ తహసీల్దార్ గోవింద్‌సింగ్ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. అదే రోజు అధికారులు ఆయన ఇంట్లో ఆకస్మిక దాడులు జరిపి పలు ఇంటి, ప్లాట్ల పత్రాలను గుర్తించారు. దీంతో కలెక్టర్ గోవింద్‌సింగ్‌ను సస్పెండ్ చేశారు. కోర్టు అనుమతితో మంగళవారం ఏసీబీ అధికారులు మరోమారు తహసీల్దార్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4 ఇళ్ల స్థలాల పత్రాలు, 450 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 43.5 లక్షల నగదు, రూ. 1.09 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రూ. 13 లక్షల షేర్‌మార్కెట్ బాండ్లు, ఒక కారు, ఒక ద్వి చక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

 

 

వీటి విలువ రూ. 2.5 కోట్లుగా అంచనా వేసినట్లు డీఎస్పీ తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ. 10 కోట్లు ఉండవచ్చని భావిస్తున్నారు. తహసీల్దార్‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచనున్నారు. ఇక ఇన్ని జరుగుతున్న మనుషుల్లో కాస్తైన అపరాధభావం కనిపించడంలేదు. నిస్సంకోచంగా ఇలాంటి సిగ్గుమాలిన పనులకు పాల్పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: