సాధారణంగా పాము కనిపించగానే.. వామ్మో అంటూ ఆమడదూరం పరుగుపెడతారు. ఎక్కడ కాటేస్తుందో అని.. కొందరు భయపడితే.. మరికొందరు దాన్ని చంపాలని ప్రయత్నిస్తారు. విషపూరితమైన సరీసృపం కావడమే ఇందుకు కారణం. అయితే పాము పగ పడుతుందా..? వెంటాడి, వేటాడి కాటేస్తుందా..? ఇలాంటి ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. అయితే జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు, సన్నివేశాలు మనకు కొన్ని నమ్మకాలను ఏర్పరుస్తాయి. అవి నిజాలో, భ్రమలో తెలీని పరిస్థితిని కల్పిస్తాయి. భయాన్నీ, భీతినీ కలిగిస్తాయి. అయితే పాము పగ గురించి అనేక నమ్మకాలు తాండవం చేస్తున్నాయి.
ఒకప్పుడు పాములు జన్మజన్మల పగ తీర్చుకుంటాయని నమ్మేవాళ్లు. పాము పగ పన్నెండేళ్లని చెప్పడం కూడా వింటూ ఉంటాం. కొందరు ఇలాంటివాటిని హాస్యాస్పదంగా భావిస్తే, ఇంకొందరు గాఢంగా విశ్వసిస్తారు. ఇలాంటి ఘటనలకు ఇదో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని జలాన్ జిల్లాలో గుడ్డు పచౌరీ అనే వ్యక్తి మోటార్ బైక్ తో వెళ్తూ అనుకోకుండా త్రాచు తోకను తొక్కించుకుంటూ వెళ్లిపోయాడు. అంతే పట్టించుకోకుండా వెళ్లిపోతున్న అతణ్ని రెండు కిలోమీటర్ల వరకూ వెంబడించి ముచ్చెమటలు పట్టించిందా పాము.
దీంతో అతనికి వెన్నులో వనుకు పుట్టి బండిని మరింత వేగంగా వెళ్లాడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ పాము అతణ్ని వదలలేదు. దాదాపు రెండు కిలోమీటర్లు వెంబడించింది. ఈ క్రమంలోనే ఆ పాము రోడ్ మీద నుంచి ఎగిరి బైక్ అందుకుంది. దీంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా బండిని ఆపేసి పరుగులు తీశాడు. అది గమనించిన జనాలు బైక్ వద్ద ఎగబడ్డారు. అయినప్పటికీ ఆ పాము తగ్గలేదు. దగ్గరకు వెళ్లబోతున్న వారిని బుసలు కొడుతూ బెదిరించింది. అరగంట వరకూ చూసి కదలకపోవడంతో అక్కడ ఉన్న జనాలు రాళ్లతో బెదిరించారు. ఎట్టకేలకు శాంతించిన పాము బైక్ను వదిలి పెట్టి వెళ్లిపోయింది. దీంతో సదరు వ్యక్తి ఊపిరిపీల్చుకున్నాడు.