గతంలో దేశంలో దొంగలు పడ్డారు అనే టైటిల్ తో సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. అది సినిమా కాబట్టి దానికి ఏదో విధంగా ఎండ్ చేస్తారు. కానీ, రియల్ లైఫ్ లో జరిగే దొంగతనాలకు ఎవరు ఎలాంటి ఎండ్ ఇస్తారు.. ఎవరూ చెప్పలేరు. ఆర్ధికంగా, దేశ సరిహద్దుల విషయంలోనూ, శత్రువులపై దాడి చేయడంలోను, సాంకేతిక రంగంలోనూ దేశం అభివృద్ధి సాధించింది. కానీ, దేశంలోపల ఉన్న అనేక సమస్యలపై మాత్రం విజయం సాధించలేకపోతున్నది.
ముఖ్యంగా గత కొన్ని రోజులుగా దేశంలో అనేక కీలక పరిణామాలు జరుగుతున్నాయి. అందులో మహిళలపై అత్యాచారం, హత్యలు, వేధింపులు... ఇవి దేశంలో కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఒకటికాదు రెండు కాదు రోజు కనీసం పదిపదిహేను చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ దేశంలో పర్యటించే విదేశీ టూరిస్టులను కూడా మనవాళ్ళు వదలడం లేదు. చిన్నపిల్లలనే వదలడం లేదు.. ఇక వాళ్ళను వదులుతారా చెప్పండి.
అయితే, ఒకవైపు అత్యాచారాలు చేసే మానవ మృగాలు ఎక్కువౌతుంటే.. మరోవైపు దొంగలు ఎక్కువౌతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో దొంగతనాలకు పాల్పడుతున్నారు. మాటువేసి అదును చూసి దెబ్బకొట్టి దోచుకుపోయారు. ఒకప్పుడు ఇంట్లో చొరబడి విలువైన బంగారం, వజ్రాలు, డబ్బు ఎత్తుకెళ్ళేవారు. కానీ, ఇప్పుడు దొంగలు తమ రూటు మార్చారు. రూటు మార్చి బంగారం, డబ్బు కంటే విలువైనవి ఎత్తుకెళ్తున్నారు.
అంతకంటే విలువైనవి ఏముంటాయని అని అంటున్నారు. అక్కడికే వస్తున్నా... విలువైన వస్తువులు చాలా ఉన్నాయి. అవేమంటే ఉల్లిపాయలు. ఇప్పుడు దేశంలో ఉల్లి ధర మండిపోతున్నది. ఒకప్పుడు రూ. 20 రూపాయలు ఉండే ఉల్లి ధర ఇప్పుడు ఏకంగా వంద రూపాయలు దాటింది. దీంతో దేశంలో ఉల్లిపాయలు కొనాలి అంటే భయపడుతున్నారు. బాబోయ్ అని పరుగులు తీస్తున్నారు. దీంతో ఇప్పుడు దొంగల దృష్టి ఉల్లిపై పడింది. ఉల్లిని దొంగతనం చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకు షాపుల్లో మాత్రమే దొంతనాలకు పాల్పడిన దొంగలు ఇప్పుడు ఏకంగా పంటపొలాలపైనే పడ్డారు. పంటపొలాల్లో ఉన్న ఉల్లి పంటను దోచుకుపోయారు. మరికొన్ని రోజుల్లో చేతికి వస్తుంది అనుకున్న పంటను దొంగలు మాయం చేస్తున్నారు. దీంతో పాపం రైతులు లబోదిబో అంటున్నారు.