వివాహం పేరుతో జ‌రిగే మోసాల్లో ఇదో దారుణ‌మైన తంతు. అమాయ‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు వేసే ఎత్తుగ‌డ‌ల్లో దారుణ‌మైన ప‌రిస్థితి. పేద‌రికం వ‌ల్ల అమ్మాయిలు, వాళ్ల తల్లిదండ్రుల‌ను దారుణ‌మైన రీతిలో వంచిస్తున్న ఉదంతాల్లో ప‌రాకాష్ట‌. అవ‌స‌రం, బీద‌రికం వంటి వాటి ఆధారంగా ఆడపిల్ల‌ల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. ల‌క్ష‌ల రూపాయ‌లు అంద‌జేస్తామ‌ని ఆశ‌చూపి...ఆఖ‌రికి ఇటు కుటుంబాల‌కు డ‌బ్బులు ఇవ్వ‌కుండా..అటు ఆడ‌వారి జీవితాన్ని అన్యాయం పాలు చేస్తున్న దారుణ‌మైన స్కాం మ‌న పొరుగుదేశాలైన పాకిస్థాన్ చైనాల మ‌ధ్య జ‌రుగుతోంది. తాజాగా అది బ‌ట్ట‌బ‌య‌లైంది.

 

ఆర్ధికంగా చితికిపోయి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న యువతుల్ని పెళ్లికుమార్తెల పేరిట పాక్ నుంచి చైనాకు అమ్మాయిల్ని అమ్ముతున్న చైనా ముఠాను పాక్ పోలీసులు గుట్టురట్టు చేశారు. చైనాకు చెందిన దళారుల వద్ద ఒక్కో యువతికి 40లక్షల నుంచి 70లక్షలు వసూలు చేస్తున్నారు. కానీ కుటుంబానికి 2లక్షల, 3లక్షలిచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. పెళ్లి పేరుతో పాక్ నుంచి చైనా బీజీంగ్‌కు యువతులను తీసుకువెళ్లి అక్క‌డ‌ వ్యభిచారం చేయిస్తున్నారు. కాదని తిరగబడితే ప్రాణాలు తీస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో పాకిస్తాన్ ఫైసలాబాద్ లో 31 అమ్మాయిల్ని చైనాకు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 

పాక్ నుంచి యువతుల్ని వధువులుగా పరిచయం చేసి వ్యభిచార కూపంలోకి దించుతున్నార‌ని తేలింది. దీనిపై పాక్ ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడంతో  పైసలాబాద్ కోర్ట్ లో కేసు నమోదైంది. బాధితుల నుంచి వివరాలను సేకరించే ప్రయత్నం చేయగా దళారులు బాధితుల్ని హింసలకు గురిచేయడంతో కేసు నీరు గారింది. అయితే రాను రాను అమ్మాయిల అక్రమరవాణ తీవ్రతరం కావడంతో పాక్ కు చెందిన సామాజిక కార్యకర్త అక్బర్ సలీం న్యాయపోరాటం చేస్తున్నారు. తాజాగా 629మంది యువతుల్ని బీజీంగ్ దళారులకు అమ్మేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకోగా...ఆర్ధికంగా నలిగిపోతున్న కుటుంబాలకు డబ్బు ఆశ చూపించి ఈ మేర‌కు దందా న‌డుపుతున్న‌ట్లు తేలింది. కాగా, పాక్ – చైనా దేశాల స్నేహ బంధంవల్ల వ్యభిచారం కూపంలో మగ్గుతున్న బాధితుల్ని రక్షించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: