ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కాళ్ళబేరంకు దిగజారాయా..? ఎంతో హుందాగా ఉండే రాజకీయాలను ఇప్పుడు హీనస్థాయికి దిగజార్చారు ఈ ఇద్దరు నేతలు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నేత ఒకరు.. మరొకరు సినిమాలతో లక్షలాది అభిమానులను సంపాదించుకున్న హీరో ఒకరు.. ఇద్దరు ఏపీ రాజకీయాలను తమ స్వార్థ రాజకీయాల కోసం ఎంత నీచమైన స్థితికి దిగజార్చారంటే.. ఉత్తర భారతంలోని నేతల పాదాల కిందకి దిగజార్చారు. శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి రాజకీయాలను దించేసి.. తమ స్థాయిని దిగువ స్థాయికి చేర్చుకున్నారు.
కషాయ పార్టీని శాసించిన ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు అదే కషాయ పార్టీకి జీ హుజూర్ అనే ధీనస్థితికి చేరారు. ఏకంగా బీజేపీ నేతలతో కాళ్ళబేరానికి వచ్చారంటే.. వీళ్ళకు అధికార దాహం ఎంతలా ఉందో అర్థమవుతుంది. ఓసారి తెలుగు నేతలంటే జాతీయ స్థాయిలోని నేతలకు వెన్నులో వణుకు పుట్టేది. కానీ ఇప్పుడు అదే జాతీయ స్థాయి నేతలను చూస్తే ఈ నేతలకు వెన్నులో వణుకు పుడుతుంది. అధికారమే పరమవాదిగా టీడీపీ అధినేత చంద్రబాబు పాకులాడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత ప్రస్టేషన్ తట్టుకోలేక పోతున్నారు చంద్రబాబు.
అధికారం కోసం ఎంతకైనా దిగజారేందుకు సిద్దమవుతున్నారో బాబు వేస్తున్న ఎత్తులు చూస్తే అర్థమవుతుంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పేస్థాయి నాది అని చెప్పుకునే చంద్రబాబు అధికారం కోసం ఇప్పుడు అదే జాతీయ పార్టీల చేతిలో కీలు బొమ్మ అయ్యేందుకు వెనుకావడటం లేదు. అందుకే టీడీపీ నేతలతో బీజేపీ కి పంచన చేరేందుకు రాయబారాలు పంపుతున్నారు. 40ఏండ్ల రాజకీయ చరిత్రగా చెప్పుకునే చంద్రబాబు ఇంతలా కాళ్ళబేరానికి దిగుతారని ఎవ్వరు ఊహించలేదు.
ఇక సామాజిక మార్పు.. తొక్క తోట కూర అని ప్రగల్భాలు పలికిన సిని హీరో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కి మద్దతు పలికారు. టీడీపీ, బీజేపీలు అధికారంలోకి రాగానే అది తన చలువే అని జబ్బలు చరుకున్నారు పవన్. వాపును చూసి బలుపు అనుకున్న పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి డిపాజిట్లు గల్లంతు అయ్యి తన సత్తా ఏమిటో తేలిపోయేలా చేసుకున్నాడు. అయితే ఓటమి చెంది కనీసం ఆరు నెలలు తిరగకుండానే వాస్తవం బోధపడింది.
అందుకే నేను ఏనాడు బీజేపీతో దోస్తానా కటీఫ్ చేసుకోలేదని ప్రకటించారు. ఇకముందు చేసుకోబోనని స్వయం ప్రకటితం చేసుకున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు.. అధికారం మీద మోజు పడ్డట్లున్నారు పవన్ కళ్యాణ్. అందుకే బీజేపీతో కాళ్ళబేరానికి దిగారు. అధికారం కోసం అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు బీజేపీతో కాళ్ళబేరానికి రావడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.