ప్రేమ... తరతరాలుగా చెక్కుచెదరని భావోద్వేగపు బంధంగా నిలుస్తూ వస్తోంది. ప్రేమే మనుషులను దగ్గరకు చేరుస్తుంది, వారి మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. ప్రేమ అంటే కేవలం ఒకరిపై ఇష్టమే కాదు.. ఓ బలమైన నమ్మకం కూడా. ప్రేమ ఎప్పుడు.. ఎవరి మధ్య.. ఎలా చిగురిస్తుందో చెప్పడం చాలా కష్టం. వాస్తవానికి ఎలాగైతే ఆకలి, దాహం అనేదాన్ని మనం నియంత్రించలేమో అదే విధంగా ప్రేమను కోరుకోవడం, ఇవ్వడం అనేదాన్ని కూడా నియంత్రించలేం. ఒక వ్యక్తిపై మనకు కలిగే బలమైన ఉద్వేగ, మానసిక స్పందనే ప్రేమ. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరిని చూసినప్పుడు అందరికీ ఇలాంటి ఫీలింగ్ కలిగే ఉంటుంది.
ఒకసారి ప్రేమ పుడితే.. ప్రేమలో పడితే జీవితాంతం ఆ వ్యక్తినే ప్రిమిస్తూ ఉంటారని చాలా మంది నమ్ముతారు. అది ఎంత వరకు నిజమో పక్కన పెడితే కొందరు ప్రేమ మైకంలో పడి ఏం చేస్తున్నారో.. ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియదు. ప్రేమ మత్తులో పడి ప్రాణాలు పోగొట్టుకున్న వారూ ఉన్నారు. అయితే ప్రేమ మైకం ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కొనేలా చేస్తుందనేందుకు ఇది మరొక ఉదాహరణ. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని కైదల్ జిల్లాకు చెందిన ఓ యువతి పాకిస్థాన్ కు చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. పాకిస్థాన్ కు వెళ్లి తన ప్రియుడిని కలుసుకోవాలనుకుంది. ఇటీవలే ప్రారంభమైన కర్తార్ పూర్ కారిడార్ ను తన మార్గంగా ఎంచుకుంది. ఒక నకిలీ ఐడీని తయారు చేసుకుని ఎలాగైతే పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టింది.
అయితే ఆమె ఐడీని పరిశీలించిన పాక్ రేంజర్లు అది నకిలీ ఐడీ అని గుర్తించారు. దీంతో ఆమెను తమ కార్యాలయంలోకి తీసుకెళ్లి విచారించిన పాక్ రేంజర్లు ఆశ్చర్యపోయారు. తన ప్రియుడిని కలుసుకోవడానికే పాకిస్థాన్ లో అడుగుపెట్టానని ఆమె చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు. కానీ.. ఆమె చెబుతున్న మాటల్లో నిజం ఉందని గ్రహించిన పాక్ రేంజర్లు... ఆమెను మందలించి తిరిగి భారత్ కు పంపించేశారు. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ మైకంలో ఇలాంటి పనులు చేయడం ప్రాణాల మీదకు తెస్తుందని కొందరు హెచ్చరిస్తుంటే.. ప్రేమ కోసం ఆమె చేసిన ప్రయత్నాన్ని పలువురు నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు.