పశ్చిమ్ బెంగాల్ లో ఏకంగా ఆ రాష్ట్ర  గవర్నర్‌యే అసెంబ్లీ ముందు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గత కొద్దికాలంగా పశ్చిమ్ బెంగాల్‌‌లో గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య అంతర్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య అది తారస్థాయికి చేరుకుంది. 

 

అసెంబ్లీ ఆమోదించిన కీలక బిల్లులను గవర్నర్ అడ్డుకుంటున్నారని మమత ఆరోపిస్తుంటే.. జగదీప్ ధన్కర్ రాజ్యాంగ నిబంధనలను పాటిస్తున్నాని, గుడ్డిగా ఆమోదించబోనని అన్నారు. బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు బిల్లులు ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో  ఉన్నాయి. గవర్నర్‌ ‘సమాంతర పాలన’ చేస్తున్నారని టీఎంసీ నేతలు ఆరోపణలు గుప్పించగా, అంతే ధీటుగా గవర్నర్ బదులిస్తున్నారు.  తాను రబ్బరు స్టాంప్   లేదా పోస్టాఫీస్ కాదంటూ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందని, నాకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు . 

 

ఈ నేపథ్యంలో గవర్నర్-సీఎం మమతా బెనర్జీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి అసెంబ్లీ వేదికయ్యింది. ముఖ్యమైన బిల్లులను గవర్నర్ అడ్డుకున్నారని ఆరోపిస్తూ దీనికి నిరసనగా రెండు రోజుల పాటు అసెంబ్లీని వాయిదావేస్తున్నట్టు సీఎం మమత మంగళవారం ప్రకటించారు. ఈ నేథ్యంలో అసెంబ్లీని సందర్శించడానికి వచ్చిన గవర్నర్ జగదీప్‌ను లోనికి ప్రవేశించకుండా వీఐపీ గేటుకు తాళాలు వేశారు. దీంతో గవర్నర్ అసెంబ్లీ గేటు వద్ద నిరసనకు దిగారు. తాను వస్తున్న సమయంలో గవర్నర్‌, ఇతర వీవీఐపీలకు ఉద్దేశించిన గేటు మూసివేశారని, మరో గేటు ద్వారా లోపలికి వెళ్లాల్సి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సెక్రటేరియట్‌ ఏడాదంతా పనిచేస్తుందని, సమావేశాలు జరగడం లేదంటే సెక్రటేరియట్‌ మూసివేశారని అర్ధం కాదని గవర్నర్ వ్యాఖ్యానించారు. 

 

చారిత్రక కట్టడాన్ని సందర్శించి లైబ్రరీని పరిశీలించడానికే తాను ఇక్కడకు వచ్చానని సమావేశాలు జరగని సమయంలోనూ సెక్రటేరియట్‌ అంతా యథావిధిగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. కాగా గవర్నర్‌ జగదీప్‌ అసెంబ్లీకి వచ్చిన సమయంలో ఒకటో నెంబర్‌ గేట్‌ మూసివేయడంతో గేట్‌ నెంబర్‌ 2 నుంచి ఆయన లోపలికి వెళ్లారు. జులై 30న పశ్చిమ్ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధన్కర్ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మమతకు, గవర్నర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: