తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. పనిచేసే రాష్ర్టాలను ప్రోత్సహించకుండా కేంద్రప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నదని ఆయ‌న ఆరోపించారు. పనిచేసే రాష్ట్రాలను ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తాయని, కానీ దురదృష్టవశాత్తు అలా జరగడంలేదని చెప్పారు. పారిశ్రామిక రంగంతో పాటు, రక్షణ రంగంలోనూ కేంద్రం రాజకీయాలు చేస్తున్నదన్నారు. కేంద్రం ఏదైనా ప్రాజెక్టు ప్రారంభిస్తే అది ఢిల్లీ-ముంబైకే పరిమితమవుతున్నదని పేర్కొన్నారు. కేంద్ర నిధులపై శాఖల వారీగా కేటీఆర్ తో చర్చకు సిద్ధమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. విభజన రాజకీయాలు చేయటం తండ్రి కొడుకుల(కేసీఆర్, కేటీఆర్)కు పరిపాటిగా మారిందని ఆయన అన్నారు. ఢిల్లీలో కాళ్ళు.. హైద్రాబాద్ లో కన్నీళ్ళు అన్నట్టు.. తండ్రీ కొడుకులు వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.

 

  

బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ల‌క్ష్మ‌ణ్ మీడియాతో మాట్లాడుతూ... భారత ప్రభుత్వంపై ట్విట్టర్ పిట్ట‌.. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. దక్షిణాదిని భాతర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్న కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని,  తెలంగాణ ప్రజల‌ను రెచ్చగొట్టి వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఎదిగిన టీఆర్ఎస్...నేడు తెలంగాణ అస్థిత్వానికే ముప్పుగా తయారైంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆరోపించారు.

 

ధనిక రాష్ట్రాన్ని తండ్రీకొడుకులు దివాలా తీయించారని ఆయన అన్నారు. రక్షణశాఖ భూములను కొట్టేయాలన్న టీఆర్ఎస్ ప్లాన్ ఫెయిల్ అయిందని, ఆ  భూములను ఇవ్వటం‌ కుదరదన్నందుకే... కేంద్రంపై కేటీఆర్ ఎదురుదాడి చేస్తున్నాడన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ నిందలు వేస్తున్నాడన్నారు. కేంద్రం నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు దారి మళ్ళించారన్నారు. కేంద్రం ఇచ్చిన నిర్భయ నిధిని కూడా ఖర్చు చేయలేని స్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. దక్షిణాది కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫ్రంట్ ఎటుపోయిందో.. కేటీఆర్ చెప్పాలన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: