దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై హాట్ హాట్ చర్చ జరుగుతున్న మహిళల భద్రతే లక్ష్యంగా దిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకకాలంలోనే సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఢిల్లీ నగరవాసులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. దేశ రాజధానిలో తిరిగే బస్సుల్లో సీసీ టీవీలు, పానిక్ బటన్స్, జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
దిల్లీ రవాణా సంస్థ (డీటీసీ), క్లస్టర్లకు చెందిన మొత్తం 5500 బస్సుల్లో సీసీ టీవీలు, పానిక్ బటన్స్, జీపీఎస్ వ్యవస్థ వీటిని అమర్చనున్నట్టు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. తొలుత ఈ నెలాఖరులోపు 100 బస్సుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. ఒక్కో బస్సులో మూడు సీసీటీవీ కెమెరాలు, 10 పానిక్ బటన్లు, జీపీఎస్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు బస్సులో ఉండే ఈ పానిక్ బటన్స్ నొక్కితే అక్కడి సమాచారం కమాండ్ సెంటర్తో పాటు అనుసంధానించిన పలు వ్యవస్థలకు చేరడంతో పోలీసులు వెంటనే స్పందిస్తారని తెలిపారు. రాబోయే ఏడు మాసాల వ్యవధిలో మొత్తం అన్ని బస్సుల్లోనూ దీన్ని అమలులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ప్రయాణీకులు బస్సుల కోసం ఎదురుచూసే పనిలేకుండా.. ఏ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేలా ఓ యాప్ను కూడా రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఆ పని పూర్తయిందనీ.. త్వరలోనే ఆ యాప్ను ఆవిష్కరించనున్నట్టు కేజ్రీవాల్ వెల్లడించారు.
ఇదిలాఉండగా, నూతనంగా 11 వేల వైఫై హాట్స్పాట్లను రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. బస్టాపుల్లో 4 వేల హాట్స్పాట్లు, మార్కెట్లలో 7వేల హాట్స్పాట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ముందుగా డిసెంబర్ 16న 100 హాట్స్పాట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఆరు మాసాల కాలంలో వారానికి 500 హాట్స్పాట్ల చొప్పున ఏర్పాటు చేసి మొత్తం 11 వేల హాట్స్పాట్లను పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నామన్నారు. ఒక వైఫైను ఒకేసారి 200 మంది 200ఎంబీపీఎస్ స్పీడ్తో 50 మీటర్ల దూరంలో ఉండి ఉపయోగించుకోవచ్చని కేజ్రీవాల్ వివరించారు.