ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల హస్తిన పర్యటనలో భాగంగా ఆయన గురువారం రాత్రి రాజధానికి చేరుకున్నారు. శుక్రవారం ఆయన బిజిబిజీగా గడపనున్నారు. ప్రస్తుతం వైసీపీ ఎంపీలతో జగన్ సమావేశమయ్యారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఇవాళ రాత్రే కేంద్ర హోం మంత్రి షాతో జగన్ సమావేశం కానున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీలో ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ శుక్రవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో విభజన సమస్యలు, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులతో పాటు పలు అంశాలపై నిశితంగా సీఎం జగన్ చర్చించనున్నారని సమాచారం. దీంతోపాటుగా కడప స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన, అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవానికి మోదీని సీఎం జగన్ ఆహ్వానించనున్నారు.
ఈ నెల 23న స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన జరగనుంది. మరోవైపు జనవరి 9న అమ్మఒడి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రధానిని సీఎం జగన్ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంద. కాగా, సీఎం జగన్ ఆహ్వానం మేరకు స్టీల్ప్లాంట్ ఓపెనింగ్, అమ్మ ఒడి పథకం ప్రారంభోత్సవానికి మోదీ తప్పకుండా వస్తారని పార్టీ శ్రేణుల సమాచారం. ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్రమంత్రులను జగన్ కలవనున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ తిరుగుపయనం కానున్నారు.
ఏపీలో జరుగుతోన్న తాజా పరిణామాలతో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీకి తాను దూరంగా లేనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించడం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను తాను అభిమానిస్తాని, వైసీపీ మాత్రం ఆయనకు భయపడుతుందని పవన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తిని, రాజకీయంగా చర్చను రేకెత్తిస్తోంది.