ఉల్లి చేసిన మేలును తల్లి కూడా చేయదు అంటారు. ఈ విషయం అందరికి తెలిసిందే. ఉల్లిపాయల కోసం దేశంలో ప్రజలు ఎంతగా విలవిలలాడిపోతున్నారో చెప్పక్కర్లేదు. కేజీ ఉల్లిపాయలు రూ. 180 కి చేరుకుంది. ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఏ ఇంట్లో ఉల్లి కనిపించడం లేదు. అంతేకాదు, ఇప్పుడు దొంగలు ఉల్లి కనిపిస్తే చాలు లేపేస్తున్నారు. ఇటీవలే మధ్యప్రదేశ్ లో కొంతమంది దొంగలు పొలంలోని ఉల్లిపంటను దోచుకెళ్లారు అంటే అర్ధం చేసుకోవచ్చు...
ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు బంగారం కాదు.. ఇంట్లో ఉల్లి ఉన్న వ్యక్తి బలవంతుడు.. కోటీశ్వరుడు.. కోట్లు ఉన్నా ఉల్లి లేకుంటే అతని కోట్లు ఏం చేసుకోవడానికి చెప్పండి. దేశంలో ఉల్లిని పండించే రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో ఉల్లి పంట దెబ్బతిన్నది. దిగుమతి సగానికిపైగా గట్టిపోయింది. దీంతో ఎగుమతులు నిలిపివేసి ఉన్న నిల్వలను మన అవసరాలకు వినియోగించుకుంటున్నారు. అయినా సరే ఉల్లి సరిపోవడం లేదు. ఒకప్పుడు పది ఇరవై రూపాయలకు దొరికే ఉల్లి వంద మార్క్ దాటింది. మార్కెట్ లో దందా చేయడం మొదలుపెట్టింది.
ఉల్లి ఘాటు పెరగడంతో ఏం చేయాలో తెలియడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయట మార్కెట్ లో ఉల్లిని కొనుగోలు చేసి.. రైతు బజార్లలో రూ. 25కి విక్రయిస్తున్నది. ఒక్కొక్కరికి కేజీ ఉల్లిపాయల చొప్పున విక్రయిస్తున్నారు. కేజీ ఉల్లిపాయలు రూ. 25 ఇస్తుండటంతో ఉదయం ఐదు గంటల నుంచే ప్రజలు పెద్ద సంఖ్యలో రైతు బజార్ ముందుకు వచ్చి క్యూలు కడుతున్నారు.
విజయనగరంలో భారీ సంఖ్యలో రైతు బజార్ గేటు ముందు క్యూలు కట్టారు. గేటు ఓపెన్ చేసే సరికి ఒక్కసారిగా అందరు లోపలికి దూసుకు వచ్చారు. అయితే, ఓ మహిళ మాత్రం రైతు బజార్ పెద్ద గోడను ఎక్కి అమాంతంగా దూకేసింది. ఉల్లి కోసం ఆ మహిళ అలా గోడ దూకడం ఇప్పుడు వైరల్ అయ్యింది. ఉల్లి కోసం మహిళలు ఇలా గోడ దూకుతున్నారని సోషలో మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఉల్లి కోసం ప్రజలు పడుతున్న కష్టాలకు ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు.