టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోమారు వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. గంటా శ్రీనివాసరావు కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో...ఆయన రాజకీయ వైఖరి ఉత్కంఠ కలిగిస్తోంది. ఒకవైపు ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుండగా, తమ వైపే వస్తారని వైసీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో...తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్ని గంటా శ్రీనివాసరావు ఖండించారు. తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలన్నీ మీడియా సృష్టే అని ఆయన చెప్పారు.
తన పార్టీ మార్పు పెద్ద ఎత్తున వైరల్ అయిన నేపథ్యంలో...విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఫంక్షన్లలో ఇతర పార్టీల వ్యక్తులను కలుస్తుంటామని, వాటిని రాజకీయాలతో ముడిపెట్టలేమని చెప్పారు. తాను నరేంద్రమోదీని కలిసి ఫోటో తీసుకున్నది నిజమేనని, అయితే అది ఆయన గుజరాత్ సీఎంగా, తాను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పటిదని చెప్పారు. ఆ ఫొటోను ఇప్పుడు వైరల్ చేస్తూ పార్టీ మారుతున్నానని ప్రచారం చేస్తున్నారని అన్నారు.తనను నిరంతరం వార్తల్లో ఉంచుతున్న మీడియాకు కృతజ్ఞతలు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా పార్టీ మారతున్నట్లు ప్రచారం జరుగుతూనే ఉందని, వార్తలు నిజం కాదని అన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే తానే చెబుతానన్నారు.
ఈ సందర్భంగా జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా గురించి పవన్ చేసిన కామెంట్స్లో ఉద్దేశం బీజేపీ మంచిదనో, లేక బీజేపీకి దగ్గరవ్వాలన్న కోరికతోనో ఆయననే అడగాలని చెప్పారు. ఇదిలాఉండగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గంటా శ్రీనివాసరావుతో మాట్లాడినట్లు సమాచారం. ఏదైనా ఉంటే వచ్చి తనను కలిసి మాట్లాడాలని, ఈ నెల 6వ తేదీన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా రావాలని ఆహ్వానించారు. తప్పనిసరిగా వస్తానని గంటా ఆయనతో చెప్పారని తెలుస్తోంది.