తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లోను పునరావృత్తం కానున్నాయా ?, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన అస్త్రాన్నే, ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సంధించబోతున్నారా ?? అంటే అవుననే రాజకీయ వర్గాల నుంచి సమాధానం విన్పిస్తోంది . దీనితో చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయడమే లక్ష్యంగా జగన్ ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది . టీఆరెస్ రెండవ సారి అధికారం లోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ కి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు .
ఆ పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడమే కాకుండా , ఏకంగా శాసనసభా పక్షాన్ని టీఆరెస్ లో విలీనం చేసేవిధంగా పథకరచన చేసి సక్సెస్ అయ్యారు . ఇప్పుడు అదే ఎత్తుగడను జగన్ అమలు చేయనున్నారని తెలుస్తోంది . త్వరలోనే ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే టీడీపీ కి చెందిన పదిమంది ఎమ్మెల్యేలను ఒక గ్రూప్ గా చీల్చేందుకు జగన్ ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది . టీడీపీని వీడిన వారు తమని ప్రత్యేక వర్గంగా గుర్తించాలని స్పీకర్ ను కోరే అవకాశాలున్నాయని సమాచారం .
ఇప్పటికే టీడీపీ ని వీడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చేసిన రచ్చ అందరికీ తెల్సిందే . అదే తరహా లో మిగతా ఎమ్మెల్యేలు కూడా టీడీపీ నాయకత్వం పై తిరుగుబాట బావుటా ఎగురవేసి , చంద్రబాబు వైఖరి పై తీవ్ర స్థాయి విమర్శలు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది . దాంతో టీడీపీ నాయకత్వం విధిలేని పరిస్థితుల్లో వారిని వదులుకోవడమే కాకుండా , పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలున్నాయి . తాము ఏదైతే కోరుకున్నామో అది జరిగిన వెంటనే టీడీపీ ని వీడిన ఎమ్మెల్యేలు వైకాపా లో టీడీ ఎల్పీ ని విలీనం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది .