డిసెంబరు 6న శుక్రవారం బ్లాక్ డే సందర్భంగా హైదరాబాద్‌లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్య గా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. బ్లాక్ డే సందర్భంగా  హైదరాబాద్‌లో శాంతికి విఘాతం కలిగించేలా మత ఘర్షణలకు అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, అందుకే ఈ  రోజు నగరమంతా పటిష్ఠమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. 

ఇటీవల బాబ్రీ మసీదు-రామ జన్మ భూమి వ్యవహారంలో సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన నేపథ్యంలో  మత ఘర్షణలకు తావు కల్పించే ఏ చర్యనూ శుక్రవారం అనుమతించబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో బైక్ ర్యాలీలు సహా, ధర్నాలు, నిరసనలు, బహిరంగ సమావేశాలు, ప్రసంగాలు, ప్లకార్డులు ప్రదర్శించడం వంటి పనులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వివరించారు. వీటిని ధిక్కరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 
 బ్లాక్ డే సందర్భంగా పోలీసులతో పాటు, కేంద్ర బలగాలు, మిలిటరీ సిబ్బంది, హోంగార్డులు తదితర భద్రతా బలగాలు డ్యూటీలో ఉండనున్నట్లు వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వీరు అదుపు చేస్తారని వెల్లడించారు. ఈ ఆంక్షలు గురువారం (డిసెంబరు 5) నుంచి శనివారం (డిసెంబరు 7) ఉదయం 7 గంటల వరకూ అమల్లో ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు. 

 1992 డిసెంబరు 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి వేశారు. మసీదు ఉన్న ఆ ప్రదేశం రామ జన్మ భూమి అని చాలా కాలం వివాదం నడిచింది. ఎన్నో ఏళ్ల పాటు ఈ వ్యవహారం కోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం  వివాదానికి కేంద్ర బిందువైన 2.77 ఎకరాల భూమిని పూర్తిగా హిందువులకు కేటాయిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాక, అయోధ్యలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. తీర్పు వెలువడిన నాటి నుంచి దేశమంతా ఎలాంటి మత ఘర్షణలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: