తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడైన రాష్ట్ర మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు (!). రిమాండ్లో ఉన్న నలుగురు నిందితులను చర్లపల్లి జైలునుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే తరుణంలో...ఈ కేసులో A1ఆరిఫ్, A2జొల్లు శివ, A3జొల్లు నవీన్, A4చెన్నకేశవులు అక్కడి నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో...పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు.
కాగా, కేటీఆర్ ఘాటు కామెంట్లు చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. గురువారం జూబ్లీహిల్స్లోని ఎంసీహెచ్ఆర్డీలో ఆలిండియా సర్వీస్ అండ్ సెంట్రల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్కు 94వ ఫౌండేషన్ కోర్సు సర్టిఫికెట్ అందించే కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. ``వెటర్నరీ డాక్టర్ హత్య దురుదృష్టకరం. ఆ నిందితులను తక్షణమే చంపండి.. ఉరి తీయండని రాష్ట్ర ప్రజలతో పాటు దేశమంతా, పార్లమెంటులో కొందరు ఎంపీలు డిమాండ్ చేశారు. ఆ ఆవేశం, ఆవేదన నాకూ ఉంది. కానీ నేను ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని. అలా చేయమని అనలేను. 2012లో జరిగిన ఘటన నిందితులకు ఉరి శిక్ష ఇంతవరకు అమలు కాలేదు. ఉగ్రవాది కసబ్ను ఎన్నేళ్లు జైల్లో పెట్టారో అందరం చూశాం. చట్టాలు మారాలి’ అని ఆన్నారు.
ఇదిలాఉండగా, దిశా ఘటనపై ఫేస్బుక్లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దిశకు వ్యతిరేకంగా.. నిందితులకు సపోర్ట్గా మట్లాడుతూ అసభ్యకరంగా కామెంట్స్ చేసిన అనిల్ కుమార్ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనిల్ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాపల్లి గ్రామానికి చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. అదే విధంగా దిశ కేసుకు సంబంధించి వ్యతిరేక పోస్టులు పెట్టిన శివ అలియాస్ శంఖు అనే యువకునిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివ జగిత్యాలకు చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు.