ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్.జగన్ తన ఢిల్లీ పర్యటనను అర్థంతరంగా ముగించుకున్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన దేశ రాజధాని నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. ఢిల్లీ నుంచి బయలుదేరుతున్న సీఎం జగన్ మధ్యాహ్నం రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడకు, అక్కడినుంచి కడపకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చేరుకున్నారు. అనంతరం నారాయణ స్వగ్రామానికి సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు సీఎం జగన్ చేరుకోనున్నారు. తిరిగి సాయంత్రం తాడేపల్లి చేరుకోనున్నారు.వైయస్ కుటుంబంతో మూడు దశాబ్దాలకుపైగా నారాయణకు అనుబంధం ఉంది. అందుకే, తన ఢిల్లీ పర్యటనను సైతం ముగించుకొని జగన్ ఆయన అంత్యక్రియలకు హాజరవుతున్నారు.
కాగా, రాష్ట్ర అభివృద్దే ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం 4.30గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రం 6.15కు ఢిల్లీకి వైయస్.జగన్ చేరుకున్నారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ వైఖరి, వివిధ అంశాల గురించి ఆయన చర్చించారు. రాత్రి ఢిల్లీలోనే బస చేసి శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమావేశం కావాల్సి ఉంది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని, అదే విధంగా రాష్ట్ర ఆర్థిక లోటు భర్తీ చేయాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నారు. ఈ సమావేశం అనంతరం శుక్రవారం రాత్రి తిరిగి అమరావతికి చేరుకోవాల్సి ఉంది. అయితే, నారాయణ మృతి చెందడంతో సీఎం జగన్ తన టూర్ క్యాన్సల్ చేసుకొని కడపకు బయల్దేరారు.