దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ నిందితులు జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు, ఆరిఫ్లని ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా చటాన్ పల్లి బ్రిడ్జి దగ్గరకి నిందితులని తీసుకెళ్ళి విచారిస్తుండగా, వారు పోలీసులపై దాడి చేసే ప్రయత్నం చేశారట. తమను తాము రక్షించుకనే నేపథ్యంలో ఈ ఎన్ కౌంటర్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశపై నలుగురు నిందితులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. షాద్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని చటాన్పల్లి బ్రిడ్జి కింద దిశను నిందితులు హత్య చేశారు. ఆ రోజు నుంచి దేశం మొత్తం ఈ కేసు విషయంలో అట్టుడికి పోయింది.
ప్రజలను ఆ కామాంధులను తమకు అప్పగించండి కొట్టి చంపుతామని.. మరికొందరు వారిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా దిశ కు జరిగిన అన్యాయంపై గళమెత్తారు. మొత్తానికి ఆ పాపాత్ముల పాపం పండింది.. అన్యాయంగా దిశను చంపినందుకు సరైన శిక్ష పడింది. దిశను హత్య చేసిన ప్రాంతానికి 300 మీటర్ల దూరంలో నింధితులను ఎన్ కౌంటర్ చేశారు. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేశారని తెలియడంతో.. ఆ ప్రాంతానికి సమీప జనాలు భారీగా తరలివచ్చారు.
దిశ ఆత్మకు శాంతి చేకూరిందని నినాదాలు చేశారు. తెలంగాణ పోలీసులకు జైకొట్టారు. నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులను ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం కురిపిస్తున్నారు. ఎన్కౌంటర్ ద్వారా సరైన సమాధానం చెప్పారంటూ స్థానికులు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా నవంబర్ 27న రాత్రి 10:30 గంటల సమయంలో దిశపై అత్యాచారం చేసి హత్య చేశారు. దిశ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ కేసును 24 గంటల్లోనే చేధించారు. నింధితులను అరెస్ట్ చేశారు. మొత్తంగా ఈ కేసును తెలంగాణ పోలీసులు 10 రోజుల్లోనే క్లోజ్ చేసి శభాష్ అనిపించుకున్నారు.