దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశాని హత్య చేసిన నలుగురు నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులుతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయే ప్రయత్నం చేయడం...పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారు. ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి వ్యవసాయ పొలంలో నలుగురి మృతదేహాలు పడిఉన్నాయి. నిందితులను ఎన్కౌంటర్ చేసిన ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని హర్షం వ్యక్తం చేస్తున్నారు.నిందితులకి తగిన శిక్ష పడిందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అయితే, ఈ విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి అధికారికంగా ఎలాంటి స్పందనా రాలేదు. ఈ రోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ చోటు చేసుకోగా...ఇప్పటివరకు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ లేదా హోంమంత్రి నుంచి కానీ ఇతర మంత్రుల ఎవరి నుంచైనా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇదే సమయంలో పోలీసుల నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఓ వైపు ప్రజలంతా, దేశవ్యాప్తంగా కూడా నిందితులని ఎన్కౌంటర్ చేయడం పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్న తరుణంలో.... ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, నిందితుల ఎన్కౌంటర్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిసే...ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్కౌంటర్ కేసులో వారికి తక్షణమే శిక్ష విధించాలని వస్తున్న ఒత్తిడిని ప్రభుత్వ పెద్దల దృష్టికి పోలీసు అధికారులు తీసుకువెళ్లగా.... నిందితులకు కఠిన శిక్షే మార్గమని అభిప్రాయం రావడంతో పోలీసులు ఈ ఎన్కౌంటర్ చేశారని పలువురు అంచనా వేస్తున్నారు. మరోవైపు దిశ కేసును తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇలా దేశం చూపు పడిన ఉదంతం, సాక్షాత్తు సీఎం తనయుడు తాను మానిటర్ చేస్తున్నట్లు ప్రకటించిన అంశంలో..పోలీసులు తగు `అనుమతి` లేకుండా ఇలా ఏకకాలంలో నలుగురిని ముట్టుబెట్టబోరని చెప్తున్నారు.