చట్టం ఎవరికైనా ఒకటే.. చట్టం అనేది పేదల విషయంలో ఒక రకంగానూ... డబ్బు విషయంలో మరో రకంగా ఎప్పుడూ ఉండకూడదు. చట్టం దృష్టిలో అందరూ సమానంగా ఉండాలి. అప్పుడే దేశ సమగ్రతకు ఒక అర్థం ఉంటుంది. తాజాగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ దిశ అత్యాచార సంఘటన విషయంలో నిందితులను ఎన్కౌంట ర్ చేయడంతో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నుంచి తెలంగాణ పోలీసుల పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా విద్యార్థి లోకం బయటకు వచ్చి క్షీరాభిషేకాలు చేస్తోంది.
ఇందుకు సజ్జనార్ అయినా తెలంగాణ పోలీసు లోకాన్ని అయినా వెరీ గుడ్ అని ప్రత్యేకంగా అభినందించాలి. ఇదే సజ్జనార్ వరంగల్ ఎన్కౌంటర్ విషయంలోనూ వేగంగా స్పందించారు. అక్కడ కూడా దాడి చేసిన నిందితులు పోలీసుల పై తిరగడంతో వారిని నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేసి పడేసారు. ఇప్పుడు దిశ నిందితులు పోలీసులపై దాడి చేయడంతో ఏ మాత్రం ఆలోచించకుండా కాల్చి పడేశారు. ఈ తరహా సంఘటనలు ఎవరైనా ఈ తరహా దాడులు చేయాలంటేనే భయం పుట్టాలి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అందుకే ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఆ రోజు వరంగల్ ఎన్కౌంటర్ లోనూ, ఈ రోజు దిశ ఎన్ కౌంటర్లోనూ తప్పు చేసిన సామాన్యులైన నిందితులను ఎన్కౌంటర్ చేసి పడేశారు. అయితే ఇదే తరహా శిక్షలు ఇప్పుడు డబ్బున్న వాళ్లు, పలుకు బడి ఉన్నోళ్లు, రాజకీయ నాయకుల విషయంలోనూ అమలు చేయాలని.. వాళ్ల బంధువులను, రక్త సంబంధికుల విషయంలో మాత్రం... వారు తప్పు చేసినా వారిని సేఫ్ చేసేలా ప్రభుత్వాలు, అధికారులు చేయకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
విజయవాడలో జరిగిన అయేషా మీరా హత్య కేసులో ఏం జరిగింది ? అన్నది కూడా ఇప్పుడు ప్రస్తావనకు రాక మానదు. ఈ రోజు దిశ నిందితుల ఎన్కౌంటర్ సందర్భంగా అయేషా మీరా తల్లి మాట్లాడుతూ నిందితులు సామాన్యలు అయినందునే వారిని కాల్చిపడేశారని.. అదే సజ్జనార్ నా కుమార్తె కేసు డీల్ చేసి ఉంటే తమకు కూడా న్యాయం జరిగేదని ఆమె ఆవేదనతో చెప్పింది. ఈ తరహా కేసుల్లో సామాన్యలే కాదు మంత్రులైనా, మాజీ మంత్రులకు చెందిన బంధువులో లేదా రక్త సంబంధీకులు అయినా వారిని కూడా ఇదే తరహా ఎన్కౌంటర్ చేసి పడేస్తే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్టు భావించాలి.