దిశ అత్యాచారం, సజీవ దహనం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ పోలీసులు నలుగురు నిందితులను ఈరోజు తెల్లవార జామున ఎన్కౌంటర్ చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన విషయం విధితమే. దిశ సంఘటన జరిగిన తొమ్మిది రోజుల్లోనే నిందితులను ఎన్కౌంటర్ చేసి సమాజం నివ్వెర పోయేలా చేశారు పోలీసులు. దిశ కేసులో తెలంగాణ సర్కారు కూడా సత్వర న్యాయం చేసేందుకు అనేక నిర్ణయాలను తీసుకుంది. ఈ నిర్ణయాల్లో భాగంగా దిశ నిందితులకు న్యాయ సహాయం అందకుండా చర్యలు తీసుకోవడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టును మంజూరు చేయడం, తెలంగాణ పోలీసులు నిందితులకు కఠిన శిక్ష పడేలా కృషి చేయడం వంటి పనులు చేశారు.
అయితే దిశ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇంత సత్వర చర్యలు చేపట్టిన తెలంగాణ సర్కారు, పోలీసులకు ఇప్పుడు మరో రెండు కేసులు సవాల్గా నిలిచాయి. అయితే వరంగల్ లో జరిగిన ఓ సంఘటన కు సంబంధించిన బాధితురాలి తల్లి ఇప్పుడు సత్వర న్యాయం కోసం దీక్షకు దిగింది. ఇది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పుట్టిన రోజునాడే అత్యాచారంకు గురై అపై హత్య కావించబడిన యువతి తల్లి ఇప్పుడు నిందితులను కూడా ఎన్కౌంటర్ చేసి నాకూతురు ఆత్మకు శాంతి చేకూర్చాలని డిమాండ్ చేయడం విశేషం. అయితే ఇక్కడ బాధితురాలి తల్లిదండ్రుల చేస్తున్న ఆరోపణలు ఇక్కడ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
దిశ కేసులో న్యాయం చేసిన పోలీసులు.. వరంగల్ కేసులో మాత్రం నిందితుల పక్షంలో పోలీసులు ఉన్నారని ఆరోపణలు చేసి కలకలం సృష్టిస్తున్నారు. నవంబర్ 27న హన్మకొండ విష్ణూప్రియ గార్డెన్ సమీపంలోని దీన్దయాళ్ నగర్లో ఉండే ఓ యువతి తన పుట్టిన రోజునాడు దేవాలయం కు వెళ్ళి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. ఇక తిరిగిరాలేదు. విష్ణుప్రియ గార్డెన్ సమీపంలో అత్యాచారంకు గురై హత్య కావించబడింది. అయితే ఈ దుశ్చర్యకు పాల్పడింది నలుగురు అని నిర్ధారణ అయింది.
అయితే హన్మకొండ పోలీసులు మాత్రం కేవలం ఒక్కరే అని చెపుతూ మరో ముగ్గురిని కాపాడుతున్నారని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఎవ్వరు ఎన్నా వారిని గుర్తించి వారిని కూడా దిశ నిందితుల మాదిరిగానే ఎన్కౌంటర్ చేసి సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు ఈ మేరకు వారు దీక్షకు దిగారు. నా కూతురును నమ్మించి మోసం చేసిన సాయిని, అతనితో పాటు ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగింది.
ఈ కేసు ఇప్పుడు తెలంగాణ పోలీసులకు ప్రతిష్టగా మారగా, కేసును తారుమారు చేసేందుకు యత్నిస్తున్న పోలీసుల ప్రతిష్టకు మచ్చగా మారింది. ఇప్పుడు ఈ కేసుతో పాటుగా నిర్మల్ జిల్లాలో సామూహిక అత్యాచారానికి,ఆపై హత్యకు గురైన టేకుల లక్ష్మీకి న్యాయం చేయాలన్నా కూడా నిందితులను పోలీసులు పట్టుకుని ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఈ రెండు కేసుల్లో పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.