సంభవామి యుగే యుగే.. దీని అర్ధం ఏంటో అందరికి తెలిసిందే. మనది పవిత్రమైన దేశం. భారతీయ సంప్రదాయాలు.. పురాణాల ప్రకారం మహిళలను గౌరవించాలి. ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారు. ఆ ప్రదేశం సుభిక్షంగా ఉంటుంది. క్షామం ఉండదు. పురాణాల్లో సీత దేవిని ఎత్తుకెళ్లిన రావణుడి పరిస్థితి ఏంటో అందరికి తెలుసు. మహాభారతంలో ద్రౌపతికి చెరబత్తిన కౌరవుల సేన చివరకు ఏమైందో అందరికి తెలుసు. ద్రౌపతిపై కన్నేసిన కీచకుడు ఎంత దారుణంగా మరణించాడో తెలిసిందే. ఇవన్నీ అందరికి తెలుసు. తెలిసి కూడా మనుషులు మానవ మృగాళ్ళుగా మారిపోతున్నారు.
ఆడపిల్లలపై పడి అత్యాచారాలు చేస్తున్నారు. హత్యలు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా పాపం ఆ ఆడపిల్లలు గమ్మున ఉండిపోతున్నారు. ఇప్పుడు కాలం మారింది. మానవ మృగాలకు బుద్ధిచెప్పే రోజులు వచ్చాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత దేశంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా దేశం మొత్తం తెలిసిపోతుంది.
ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. జరిగిన సంఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులపైనా పోలీసులపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఫలితంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ఓ ఉదాహరణ దిశ కేసు. దిశపై అత్యాచారం హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఈరోజు ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ ను ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతించారు.
పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారని సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్క హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని అన్ని చోట్ల ప్రజలు దిశ ఎన్ కౌంటర్ ను స్వాగతిస్తున్నారు. ఇలాంటి పనులు చేసిన ముష్కరులకు తగిన బుద్ధి చెప్పాల్సిందే అని అంటున్నారు. 2012లో జరిగిన నిర్భయ కేసులో నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారు.. కానీ దిశ విషయంలో మాత్రం సత్వరమే న్యాయం జరిగింది. దిశ పేరు దశదిశలా మారుమ్రోగిపోతున్నది.