తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన ‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ పట్ల దేశవ్యాప్తంగా  తెలంగాణ పోలీసులపై  ప్రశంసలు కురుపిస్తున్నారు . తెలంగాణ పోలీసులు నిజమైన హీరోలని, వారిని చూసి ఇతర రాష్ట్రాల పోలీసులు నేర్చుకోవాల్సింది చాలా ఉందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, ఇతర సెలెబ్రిటీలు, సామాన్య ప్రజలు సైతం ఈ ఘటనపై సానుకూలంగా స్పందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే గడిచిన ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో రెండు సంచలన ఎన్‌కౌంటర్లు జరగ్గా.. ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్ మూడోది.​

 
దేశంలోని అనేక నేరాల్లో అభియోగం ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ వికారుద్దీన్‌ను 2015, ఏప్రిల్ 7న వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దులో తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హైదరాబాద్‌లో ఆరుగురు పోలీసులను కాల్చి చంపిన ఘటనతో పాటు గుజరాత్ హోం మంత్రిపై  దాడి ఘటనలో నిందితుడైన వికారుద్దీన్‌‌ను 2015 ఏప్రిల్ 7న వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దులో కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులపై వికారుద్దీన్‌తో పాటు వికార్‌ అహ్మద్‌, సయ్యద్‌ అంజాద్‌ అలియాస్‌ సులేమాన్‌, ఇజార్‌ఖాన్‌, మహ్మద్‌ అనీఫ్‌, మహ్మద్‌ జకీర్‌ దాడికి యత్నించి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసుల ఆయుధాలు లాక్కుని వారిపైనే కాల్పులు జరిపేందుకు సిద్ధమైన వికారుద్దీన్ గ్యాంగ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. వరంగల్ జైలు నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా జనగామ దాటాక, ఆలేరు సమీపంలోని కాకతీయ తోరణం దగ్గర మూత్ర విసర్జన  కోసం వాహనం ఆపాలని ఉగ్రవాదులు అడిగారు. అక్కడే వారు పోలీసులపై దాడికి పాల్పడేందుకు యత్నించి ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.

 
తెలుగు రాష్ట్రాల్లో అనేక భూ సెటిల్‌మెంట్లు, కబ్జాలు, హత్యలు చేస్తూ వేల కోట్ల రూపాయల ఆస్తులు పోగేసి ప్రభుత్వానికి సవాల్‌గా మారిన గ్యాంగ్‌స్టర్ నయీంను పోలీసులు 2016, ఆగస్టు 8న ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ గ్రామంలోని మిలీనియం టౌన్ షిప్ లోని ఓ ఇంట్లో నయీం తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు పెద్దయెత్తున అక్కడికి చేరుకున్నారు. నయీం అనుచరులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపారు. ఈ కాల్పుల్లో నయీం అక్కడికక్కడే చనిపోయాడు. నయీంపై వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి. నక్సలైట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీమ్... దందాలు, ల్యాండ్ సెటిల్మెంట్ల, బెదిరింపుల ద్వారా వందల కోట్లు కొల్లగొట్టినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌లో సజ్జనార్ కీలక పాత్ర పోషించడం విశేషం. అప్పట్లో ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న సజ్జనార్ నయీంకు సంబంధించి పక్కా సమచారం రాబట్టి అతడిని ఎన్‌కౌంటర్‌లో కీలకపాత్ర పోషించారు.
 

నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అంతటి సంచలనం కలిగించిన ‘దిశ’ హత్యాచార కేసులో నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద ‘దిశ’ను దహనం చేసిన చోటికి గురువారం అర్ధరాత్రి పోలీసులు నిందితులను తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆ నలుగురిని  కాల్చిచంపారు. తాజా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ పోలీసుల పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ‘దిశ’ కేసును పర్యవేక్షిస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సోషల్‌మీడియాలోనూ ‘సాహో సజ్జనార్’
అంటూ కీర్తిస్తున్నారు. క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి తెలంగాణ పోలీసుల తరహాలోనే శిక్ష వేయాలంటూ అనేక మంది అభిప్రాయపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: