దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసును పోలీసులు కేవలం పది రోజుల్లోనే క్లోజ్ చేశారు. నవంబర్ 27న రాత్రి 10:30 గంటల సమయంలో దిశపై అత్యాచారం చేసి హత్య చేశారు. దిశ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ కేసును 24 గంటల్లోనే చేధించారు. నవంబర్ 28న ప్రధాన నిందితుడైన ఆరిఫ్ పాషాతో పాటు జొల్లు నవీన్, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులను పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 29న షాద్నగర్ పోలీసు స్టేషన్లో నిందితులను పోలీసులు విచారించారు. నవంబర్ 30వ తేదీన నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. డిసెంబర్ 4వ తేదీన పోలీసులు నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా 5వ తేదీ రాత్రి ఘటనాస్థలికి పోలీసులు నిందితులను తీసుకువచ్చారు. శుక్రవారం(డిసెంబర్ 6) తెల్లవారుజామున ఉదయం 3 గంటల సమయంలో దిశ హత్య జరిగిన ప్రాంతంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు నిందితులు యత్నించారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. నిందితుల ఎన్కౌంటర్ దిశను హత్య చేసిన ప్రాంతానికి 300 మీటర్ల దూరంలో జరిగింది. మొత్తంగా ఈ కేసును తెలంగాణ పోలీసులు 10 రోజుల్లోనే క్లోజ్ చేసి శభాష్ అనిపించుకున్నారు.
ఇక ఇదిలా ఉండగా... దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసిన హైదరాబాద్ పోలీసులకు హర్యానాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) నజరానా ప్రకటించింది. ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున రివార్డు ఇస్తామని రా గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ నరేశ్ సెల్పార్ చెప్పారు. హైదరాబాద్ పోలీసులు చేసిన పనిని తాము అభినందిస్తున్నామని అన్నారు. రేపిస్టులపై దయ అవసరం లేదు... క్షమాభిక్ష పిటిషన్లపై సమీక్ష (రివ్యూ) జరగాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఈ వ్యాఖ్యలు ఎవరో చేస్తే మనం అంతగా పట్టించు కోవాల్సిన అవసరం ఉండేది కాదేమో. కానీ స్వయంగా రాష్ట్రపతే ఇలా మాట్లాడటం సంచలనమే. ఎందుకంటే... ఈ దేశంలో క్షమాభిక్ష పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికే ఉంది.