హైదరాబాద్ షాద్ నగర్ సమీపంలో అమాయకురాలైన వైద్యురాలు దిశను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల వరకు దిశను రేప్ చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు దేశ ప్రజానీకం. అయితే తాజాగా పోలీసులు ఎన్కౌంటర్లో దిశ కేసులో నిందితులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. కేసు రికన్స్ట్రక్షన్ చేస్తుండగా దిశ కేసులో నలుగురు నిందితులు తమ మీద దాడి చేసి తమ దగ్గర నుంచి పారిపోయేందుకు ప్రయత్నాలు చేశారని... తమ దగ్గర ఉన్న తుపాకులతో దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే వారిని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన విషయం తెలిసిందే.
కాగా విశాఖ కేసులో నలుగురు నిందితుల ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ పరిశీలించింది. ఈ సందర్భంగా ఆ నలుగురు నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న పది మంది పోలీసు అధికారులను మానవ హక్కుల కమిషన్ ప్రశ్నించింది . ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది జాతీయ మానవ హక్కుల కమిషన్. దిశా కేసు ఘటనను విచారిస్తున్న ఏసీపీ తోపాటు పర్యవేక్షిస్తున్న డిసిపి లను కూడా పలు ప్రశ్నలు అడిగి వివరాలను సేకరించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. మొదట షాద్నగర్ చటన్పల్లి చేరుకున్న మానవ హక్కుల కమిషన్ అక్కడి... అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద దిశ మృతదేహాన్ని కాల్చిన ప్రాంతాన్ని పరిశీలించింది .
అనంతరం పోలీసులు ఎన్కౌంటర్ చేసిన స్థలంలో మృతదేహాలు మార్కింగ్ స్థలాలను పరిశీలించారు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు . ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సెల్ఫోన్ ద్వారా వీడియో తీశారు . ఇక అంతకు ముందుగా ఎన్కౌంటర్ లో చనిపోయిన నలుగురు నిందితుల మృతదేహలను ... మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ పరిశీలించగా... అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పర్యవేక్షణలోనే వీడియో రికార్డింగ్ ద్వారా ఎన్ కౌంటర్ లో చనిపోయిన నిందితుల పోస్టుమార్టం పూర్తయింది. నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై విచారణ చేపట్టి పరిశీలించిన మానవ హక్కుల కమిషన్ సభ్యుల్లో మొత్తంనలుగురు సభ్యులు ఉండగా వీరిలో ఒకరు మహిళా సభ్యురాలు కూడా ఉన్నారు.