ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి గురించి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ౦ మార్కెట్ లో రు. 33 వేల కోట్లకు పైగా అప్పులు చేసింది. వాటితో అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచుతుందన్న విమర్శలు ఉన్నాయి. దీనికి అధికార పార్టీ నేతల వెర్షన్ మాత్రం తాము ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నామన్నట్టుగా ఉంది. దీనితో ఆదాయం రాక అప్పులు పెరిగిపోతు నిర్వహణ కూడా కష్టంగా మారే ప్రమాదం ఉంటుంది.
ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాల మీద జగన్ కి ఎదురు చెప్పే అవకాశం కూడా లేదని.. ఆయన ఎవరి మాట వినడం లేదని, సంక్షేమ కార్యక్రమాల ద్వారా అప్పులు చెయ్యాలని భావిస్తున్నారు. దీంతో సీనియర్ అధికారుల మీద కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగిపోతుంది. సీనియర్ అధికారులకు ఆర్ధిక నిర్వహణ అనేది భారంగా మారుతుంది. ఒకటి తారీఖు వస్తుంటే చాలు చెల్లింపుల కోసం చుక్కలు చూస్తున్నారు అధికారులు.
వేల కోట్ల రూపాయలకు చెల్లించాల్సిన వడ్డీలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగులకు జీతాలు వంటివి పెను భారంగా ప్రభుత్వానికి మారాయి. ఇక నిధుల సమీకరణ విషయంలో కొందరి మీద ప్రభుత్వ పెద్దల ఒత్తిడి తీవ్రంగా ఉంది. కనీసం ఇప్పుడు కొందరు అధికారులు ఏం చెప్పినా సరే విని పరిస్థితి ప్రభుత్వంలో కనపడటం లేదు. దీనితో ఒకటో తారీఖు వస్తుంటే చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు అధికారులు. రాను రాను బహిరంగ మార్కెట్ లో అప్పులు కూడా దొరికే పరిస్థితి లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.
ఇది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంది. ఇక ఒకటో తారీఖు వస్తుంది అంటే సచివాలయంలో, ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులు... ప్రభుత్వ పెద్దలను, ఆర్ధిక మంత్రిని కలిసి మా వల్ల కాదు, ఆదాయం రావడం లేదు, వచ్చిన అప్పులు చెల్లింపులు చేయలేకపోతున్నాం అన్నారట. మరి ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే సంవత్సరం ముగింపు నాటికి పరిస్థితి ఇంకెలా ఉంటుందో ? చూడాలి.