ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి టీడీపీ కోలుకుందా? చంద్రబాబు గడిచిన ఆరు మాసాలుగా చేసిన ప్రయత్నం ఫలించిందా? అంటే కొంత సానుకూల సమాధానమే వినిపిస్తుండడం గమనార్హం. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచి నా.. 40 శాతం ఓటు బ్యాంకు సొంతమైంది. అయితే, ఓటు షేరింగ్ మాట ఎలా ఉన్నప్పటికీ.. ప్రజలకు కావాల్సింది ఎన్ని సీట్లు గెలు చుకున్నారనే అయితే, ఈ విషయంలో టీడీపీ చాలా వెనుకబడింది. ఇక, పార్టీలో సీనియర్లు కూడా ఓటమిని మరో రూపంలో అర్ధం చేసుకున్నారు. చంద్రబాబు నాయకత్వానికి పెను సవాలుగా మారే విధంగా వారు వ్యవహించారు.
ఈ క్రమంలోనే చాలా మంది నాయకులు కూడా పార్టీ మారిపోయారు. ఇక, తనకు మారుగా తన కుమారుడు లోకేష్ను రంగంలో కి దింపేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన కూడా బలంగా వినిపించడం, ఆయన ఈ ఏడాది ఎన్నికల్లో సత్తా చాటలేక పోవడం, ఉత్తరాంధ్ర జిల్లాలను సవాలుగా తీసుకుని ప్రచారం చేసినా.. అక్కడ పార్టీ ఆశించిన మేరకు ప్రగతి చూపించకపోవడంతో పార్టీ పరిస్థితిపై అనేక సందేహాలు అలుముకున్నాయి. ఇది నిన్నటి వరకు ఉన్న వాదన.
అయితే, అనూహ్యంగా చంద్రబాబు పుంజు కున్నారని అంటున్నారు పరిశీలకులు. జగన్ సర్కారుపై అనేక రూపాల్లో పోరాటాలు చేశారు. అనేక సమస్యల విషయంలో జగన్ పుంజుకోలేక పోయారనే వాదనను బలంగా తీసుకు వెళ్లారు. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో జగన్ దూకుడు చూపించకపోగా దీనిని తరలించే ప్రయత్నం చేస్తున్నారనే వాదనను సక్సెస్ చేయడంలోనూ బాబు దూకుడు ప్రదర్శించారు. ఇది ఆయనకు బాగా కలిసి వచ్చిందనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది.
తాజాగా మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అందరికీ ఆయన ఆహ్వానం పంపారు. ఈ క్రమంలో పార్టీ నుంచి వెళ్లిపోతారంటూ.. వాదన వినిపించిన నాయకులు కూడా ఇక్కడకు కలిసి రావడం, ప్రభుత్వంపై పోరు పెంచుతామని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని వారు చెప్పడం బాబుకు అండగా ఉంటామనడం వంటివి టీడీపీలో మరో ఉత్తేజపూరిత అంశం తెరమీదికి వచ్చిందనే వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు బాగానే ఉన్నప్పటికీ..ఎన్నికల తర్వాత ఇబ్బందులు ఎదురైన పార్టీలో అనూహ్యమైన వాతావరణం కనిపించిందనే వాదనకు బలం చేకూరుతోంది. మరి ఈ తరహా వాతావరణాన్ని బాబు ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్తారో చూడాలి.