కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన నిత్యం మీడియాలో ఉంటారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పార్టీ తరఫున కూడా బాణీ వినిపిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. నియోజకవర్గంలోని సమస్యల గురించి కానీ, ఇక్కడి ప్రజల గురించి కానీ, గడిచిన ఆరు మాసాల్లో ఒక్కమాటంటే ఒక్కమాట కూడా ఆయన మాట్లాడలేదు. పైగా నియోజకవర్గంలోనూ ఆయన పర్యటించడం దాదాపు మానుకున్నారు.
దీంతో తమ నాయకుడు ఎక్కడున్నాడంటూ.. టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తుంటే.. ప్రజలు కూడా దేవినేని ఉమా వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. ఓడిపోయినా ప్రజలను అంటిపెట్టుకుని ఉంటానని చెప్పిన ఆయన ఇప్పుడు తమకు కనిపించడం లేదని వాపోతున్నారు. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ విజయం సాధించారు. అయితే, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తరఫున ఉమా కూడా నియోజక వర్గంలో సమస్యలపై దృష్టి పెడితే.. తమ సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అవుతాయనేది ఇక్కడి ప్రజల వాదన. కానీ, ఆయన మాత్రం నియోజకవర్గం ఊసు కూడా ఎత్తుడం లేదు.
పార్టీ పరంగా మాత్రమే ఉమా మాట్లాడుతున్నారు తప్ప.. ఇక్కడి రైతులకు ఎదురవుతున్న సమస్యలను తెరమీదికి తీసుకు రావడంలో ఆయన సక్సెస్ కాలేక పోతున్నారు. చిత్రం ఏంటంటే.. ఆయన అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా ఉండడంతో అప్పట్లోనూ ఆయన నియోజకవర్గంపై దృష్టి పెట్టలేదు. పార్టీ శ్రేణులతోనూ కలివిడా ఉన్నది లేదు.
ఇక, ఇప్పుడు విపక్షంలో ఉండగా కూడా ఆయన ఎవరినీ పట్టించుకోక వడం లేదు. దీంతో ఇక్కడ దేవినేనిపై ఎన్నికలకు ముందు న్న వ్యతిరేకత అలానే ఉందని పరిశీలకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే దూరదృష్టి ఉంటే.. ఇప్పటికైనా ఆయన ప్రజలకు చేరువ కావాలని వీరు సూచిస్తున్నారు. మరి దేవినేని వింటారా.. తన పద్ధతి ని మార్చుకుంటారా? చూడాలి.