రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అయితే, కర్ర విడిచి సాము చేసే నాయకుల పరి స్థితి మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఈ విషయంలో జనసేనాని పవన్ పై సోషల్ మీడియాలో ఇ లాంటి టాకే వినిపిస్తోంది. మార్పు తెస్తానంటూ రాజకీయ అరంగేట్రం చేసి సొంత పార్టీ పెట్టుకున్న పవన్ సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, తనను తాను నిరూపించుకోవ డంలోను ప్రజలతో జై కొట్టించుకోవడంలోనూ ఆయన వెనుక బడ్డారు.
అదే సమయంలో ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కీలక నాయకులు కూడా పార్టీకి దూరమవుతున్నారు. ఎప్పుడు ఎవరుంటారో.. ఎవరు వెళ్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అలాంటి నాయకుడు తన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడతారని అందరూ అనుకున్నారు. కానీ, పవన్ మాత్రం దీనికి భిన్నంగా అడుగులు వేస్తున్నారు. తాను తన పార్టీ విషయాన్ని పక్కన పెట్టి బీజేపీ కోసం ప్రచారం చేస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన గతంలో టీడీపీకి, బీజేపీకి ఒకసారి ప్రచారం చేసి వారిని అధికారంలోకి తెచ్చారు.
అయితే, ఇప్పుడు ఆయన ఒంటరిగా పోటీ చేయడం తనకు ప్రజల్లో ఉన్న ఆదరణ ఏంటో తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అయినా, ఏ నాయకుడు అయినా కూడా ముందు తనను తాను చక్కదిద్దుకుని, ప్రజల్లో ఆదరణ కోసం ప్రయత్నిస్తాడు. కానీ, పవన్ మాత్రం ఇటీవల చేసిన ప్రకటనలు చూస్తే.. తన సంగతి ఏమో కానీ, బీజేపీకి మాత్రం మౌత్ పీస్ అనిఅనిపించుకునేందుకు తహతహ లాడుతున్నారు. పోనీ.. తనకు ఏమైనా వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయా? కేంద్రంలోనో.. రాష్ట్రంలోనో ప్రభుత్వాల అండలేక పోతే.. తన మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉందా? అంటే అది కూడాలేదు.
అయినా కూడా పవన్. మాత్రం బీజేపీకి వంత పాడుతున్నారు. మోడీని, అమిత్ షాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తన విషయానికి వస్తే.. గెలుపు ఓటములతో సంబంధం లేదని అంటున్నారు. ఈ వింత రాజకీయాలు చూస్తున్న సోషల్ మీడియా ప్రజలు మాత్రం పవన్ రాజకీయం ఆయనకైనా అర్ధమవుతోందా? అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కామెడీ పాలిటిక్స్ చూస్తుంటే కామెడీలకే పెద్ద కామెడీగా మారింది. మరి జానీ ఎప్పటికి తెలుసుకుంటారో చూడాలి.