ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఈ సందర్భంగా మాట్లాడుతూ...‘ 43మంది అమాయకులు అగ్నిప్రమాదంలో మృతి చెందారు. చనిపోయినవారి ప్రాణాలు తెచ్చివ్వలేం. అయితే ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడ్డవారికి రూ.లక్ష ఆర్థిక సాయం ఢిల్లీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అందిస్తోంది’ అని తెలిపారు.
మరోవైపు ముఖ్యమంత్రి ఈ ప్రమాదంలో గాయపడి లోక్నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ఈ ప్రమాదంలో సుమారు 15మంది గాయపడ్డారని, క్షతగాత్రుల్లో ఒకరికి 50శాతం గాయాలు అయ్యాయని, మిగతా ఎనిమిది మంది దట్టమైన పొగ పీల్చడం కారణంగా అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన, వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సీఎం కేజ్రీవాల్ బాధ్యులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ఈ ఘోర అగ్నిప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ 'అతి భయంకర సంఘటన నన్ను తీవ్రంగా బాధించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు. సహాయక చర్యలకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే ప్రధానమంత్రి మృతుల కుటుంబాలకుసహాయనిధి కింద రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50వేలు తక్షణ సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.
కాగా ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని రాణి ఝాన్సీ రోడ్డులో ఓ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 43మంది ఇప్పటివరకూ మృతి చెందారు.కార్మికులంతా ఈ ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు భవనం యజమాని మహ్మద్ రెహన్పై ఐపీసీ సెక్షన్ 304 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండగా, యజమాని సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్ ఇంజన్లను ఉపయోగించారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.