రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు ఏ పార్టీలో ఎప్పుడుంటారో అర్ధం కాదు. ఇకపోతే ఏపీకి చెందిన కీలక నేత బీజేపీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అసలే  ఏపీలో అంతంతమాత్రంగా ఉన్న బీజేపీకి ఈ దెబ్బతో భారీ షాక్ తగిలింది. ఇక నర్సాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కమలం పార్టీ నుంచి ఫ్యాన్ గాలి కింద సేదతీరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గోకరాజు సహా ఆయన కుటుంబంతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని రాజకీయ వర్గాల్లో వేడి వేడిగా చర్చ నడుస్తోంది.

 

 

ఇదే కాకుండా ఆయన సోమవారం సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరతారని ప్రచారం కూడా జరుగుతుంది.. అయితే ఇప్పుడు గోకరాజు గంగరాజు వ్యవహారం కొత్త చర్చకు తెరలేపింది. ఇప్పటి వరకు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారంటూ లీకులు వదులుతున్న బీజేపీకి, గోకరాజు వ్యవహారంతో గొంతులో వెలక్కాయ పడ్డట్టైంది. ఇప్పటికే కొందరు నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కడతారని చెబుతున్న తరుణంలో తాజా సంఘటన కమలనాథులకు భారీ షాక్ అని చెప్పకనే చెప్పాలి.

 

 

ఇకపోతే గోకరాజు గంగరాజు 2014 ఎన్నికల్లో  బీజేపీ తరఫున నర్సాపురం ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ అగ్రనేతలతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. అలాగే ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీతోనూ సన్నిహితంగా ఉండేవారు.

 

 

ఇదే కాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అమిత్ షా ఎప్పుడు ఏపీ పర్యటనకు వచ్చినా కృష్ణా కరకట్టపై ఉన్న గోకరాజు అతిథి గృహంలోనే దిగేవారట. ఈ దశలో ఈయన ఫ్యాను చేతపట్టుకోవడానికి అడుగు ముందుకేస్తుంటే అమిత్ షా ఆ స్విచ్ ఆఫ్ చేస్తాడో లేదో అని మిగతా నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: